రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగానూ 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వు చేయగా, మిగతావి (12) జనరల్ స్థానాలు. అధికార కాంగ్రెస్ పార్టీ 12 జనరల్ సీట్లలో 9 స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టింది. అందులో 7 సీట్లను ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది.
Congress | హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు గురువారంతో గడువు ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో అనుసరించిన సామాజిక సమీకరణలపై స్పష్టత వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వు చేయగా, మిగతావి (12) జనరల్ స్థానాలు. అధికార కాంగ్రెస్ పార్టీ 12 జనరల్ సీట్లలో 9 స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టింది. అందులో 7 సీట్లను ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. రాష్ట్ర జనాభాలో సగాని కంటే ఎక్కువగా దాదాపు 55 నుంచి 60 శాతం బీసీ జనాభా ఉండగా, ఈ వర్గాలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించింది. మొక్కుబడిగా 3 సీట్లు కేటాయించి చేతులు దులుపుకున్నది. బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న యాదవ, గౌడ సామాజిక వర్గాన్ని పూర్తిగా విస్మరించింది. ఎస్సీలలో అత్యధికంగా 70 లక్షల మంది మాదిగల జనాభా ఉండగా, ఎస్సీలకు రిజర్వు చేసిన 3 సీట్లలో మాదిగలకు ఒకే ఒక సీటు (కడియం కావ్య-వరంగల్) కేటాయించి, తక్కువ జనాభా కలిగిన మాల సామాజిక వర్గానికి మాత్రం 2 సీట్లు (మల్లు రవి-నాగర్కర్నూల్), (వంశీకృష్ణ-పెద్దపల్లి) కేటాయించింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నప్పటికీ వారికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఇది ఆ సామాజికవర్గాన్ని తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో అణగారిన వర్గాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. 12 జనరల్ స్థానాల్లో ఆరింటిని బీసీలకు కేటాయించింది. బీసీలలోనూ కులాల వారీగా సమతూకం పాటించింది. కాంగ్రెస్ యాదవ, గౌడ సామాజిక వర్గాలను విస్మరించింది. బీఆర్ఎస్ మాత్రం గౌడ సామాజికవర్గం నుంచి తిగుళ్ల పద్మారావు (సికింద్రాబాద్), యాదవ సామాజికవర్గం నుంచి గడ్డం శ్రీనివాస్యాదవ్ (హైదరాబాద్), క్యామ మల్లేశ్ (భువనగిరి)కు టికెట్లు కేటాయించింది. మాదిగల జనాభా ఎక్కువగా ఉండడంతో 3 రిజర్వుడు స్థానాల్లో రెండు సీట్లను సుధీర్కుమార్ (వరంగల్), ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ (నాగర్కర్నూల్) కేటాయించింది. కొప్పుల ఈశ్వర్కు పెద్దపల్లి కేటాయించింది. రెడ్డి సామాజికవర్గానికి కాంగ్రెస్ ఏడు సీట్లు కేటాయించగా, బీఆర్ఎస్ మాత్రం నాలుగు సీట్లు మాత్రమే కేటాయించింది. కమ్మ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తూ ఖమ్మం స్థానాన్ని నామా నాగేశ్వరరావుకు ఇచ్చింది.