కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : గిరిజన తెగలు దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయడం తగదని గిరిజన మహిళలపై దాడులు, హత్యలు నివారించేలా ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి కృష్ణ నాయక్ లు అన్నారు. సోమవారం ప్రపంచ గిరిజన హక్కుల దినోత్సవం సందర్భంగా కేపీహెచ్బీ కాలనీ మొదటి రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద గిరిజన హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజన దళితులకు ఒక న్యాయం, అగ్రవర్ణాల వారికి మరో న్యాయం జరుగుతుందని దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి గిరిజన, దళితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. గిరిజనుల అభివృద్ధికి కేటాయించిన నిధులను దారి మళ్లించకుండా వారికే కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నేతలు గోపాల్, చిరంజీవి, మంగ్యా బాషా, శంకర్, రాజు, హన్మంతు, శ్రీను, ఆర్.గోపాల్ తదితరులు ఉన్నారు.