కేపీహెచ్బీ కాలనీ: ఇంటి పరిసరాలలో పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ 10 నిమిషాలు కేటాయించాలని మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె. రవికుమార్ అన్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 10 గంటలకు 10 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఎంటమాలజీ సిబ్బంది కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్ ఎంఐజీలలో ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో నీటి నిల్వలు పెరగడం వల్ల దోమలు, ఈగలు వృద్ధి చెందుతాయని తద్వారా విష జ్వరాల బారిన పడాల్సి వస్తుందన్నారు.
అందుకోసమే ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు 10 నిమిషాలు కేటాయించాలన్నారు. లార్వా దశలోనే దోమలను నియంత్రించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ అసిస్టెంట్ నగేశ్, మహేందర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.