ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల (Brahmotsavam) చివరిరోజు గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం (Chakrasnanam) వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్ పల్లకిలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు. అక్కడ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు.
సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంతో అభిషేకాలు ఘనంగా జరిపారు. అనంతరం అర్చకులు వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. రాత్రికి ధ్వజావరోహణంతో కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.