సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కర్ణాటక కేంద్రంగా తెలంగాణ రాష్ర్టానికి డీజిల్ స్మగ్లింగ్ చేస్తూ, రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న ఒక ఘరానా ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. కర్ణాటకలో డీజిల్ ధర రూ.86.39 కాగా, తెలంగాణలో డీజిల్ ధర రూ.95.65 ఉంది. ఈ రెండు రాష్ర్టాల మధ్య డీజిల్ ధర 9 రూపాయల తేడా ఉన్నది. దీనిని ఆసరాగా చేసుకున్న రాధాకృష్ణ కర్ణాటకలో డీజిల్ను కొనుగోలు చేసి, తెలంగాణ రాష్ట్రంలోని పలువురికి సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు కోట్ల రూపాయల గండి పడుతున్నది. ఈ మేరకు సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్వోటీ బృందం గచ్చిబౌలి పోలీసులతో కలిసి నిఘా పెట్టారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన డీజిల్ నిల్వ కేంద్రంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో రూ.10.36 లక్షల విలువజేసే 10,800 లీటర్ల డీజిల్ను పట్టుకున్నారు. అంతేకాకుండా, అక్రమంగా డీజిల్ను రవాణా చేస్తున్న ట్యాంకర్ల డ్రైవర్లు మహ్మద్ షానవాజ్, మహ్మద్ నిజాముద్దీన్, మహ్మద్ సయ్యద్ ఖాన్, అమ్మడపల్లి కార్తిక్, శోభన్, చింతపల్లి కామేశ్వర్రావులను అరెస్టు చేశారు.
ప్రధాన డీజిల్ స్మగ్లర్ రాధాకృష్ణ, డోర్స్టెప్ డీజిల్ సర్వీసెస్ కంపెనీ యజమాని, డీజిల్ స్మగ్లర్ సూర్య అలియాస్ సాయిరాం సూర్య, డోర్స్టెప్ డీజిల్ సర్వీసెస్ కంపెనీ సూపర్వైజర్ రిషి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. డీజిల్తో పాటు రూ.35 లక్షల విలువజేసే ఏడు చిన్న ట్యాంకర్లను కూడా సీజ్ చేశారు. డీజిల్ స్మగ్లర్ రాధాకృష్ణపై గతంలో కూడా గచ్చిబౌలి తదితర ఠాణాల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు.