Devdutt Padikkal : ‘నయావాల్’ ఛతేశ్వర్ పూజారా వీడ్కోలు అనంతరం మూడో స్థానంలో నిఖార్సైన ఆటగాడి కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు నిరీక్షణకు తెరపడేలా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో శ్రీలంక పర్యటనకు దూరమవ్వగా.. అవకాశాన్ని అందిపుచ్చుకున్న దేవ్దత్ పడిక్కల్(Devdutt Padikkal) శతకంతో చెలరేగాడు. ఓపెనర్లు విఫలమైనా గోడలా వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ.. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పుతూ లంక బౌలర్ల భరతం పట్టిన పడిక్కల్ నేను సరైనోడిని అని నిరూపించుకున్నాడు. లంకపై అంతలా విజయవంతమవ్వడానికి పక్కా ప్లాన్తో సాధన చేశాడీ లెఫ్ట్ హ్యాండర్.
విదేశీ పర్యటనల్లో రాణించాలంటే అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ప్రత్యర్థి బౌలర్ల బల హీనతలను పసిగట్టి.. జట్టును ఆదుకునే ఇన్నింగ్స్లు ఆడాలి. మూడో స్థానంపై కన్నేసిన సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోలేదు. కరుణ్ నాయర్, వాషింగ్టన్ సుందర్లు సైతం స్క్వాడ్లో లేరు. ఈ పరిస్థితుల్లో భారీ సెంచరీ కొడితే.. జట్టును గట్టెక్కిస్తే చాలు మరిన్ని అవకాశాలు వస్తాయి.

వామప్ మ్యాచ్లో దేవ్దత్ పడిక్కల్ అదే పని చేశాడు. లంక పర్యటనకు ఎంపికవ్వగానే అతడు తన బ్యాటింగ్ సన్నద్ధతను మార్చాడు. బెంగళూరులో తన చిన్నప్పటి కోచ్ మొహమ్మద్ నసీరుద్దిన్(Mohammad Naseeruddin)తో కలిసి వర్కవుట్ చేశాడు. కోకాబుర్రా బంతులు, శ్రీలంక తరహా పిచ్లను తయారు చేయించుకొని బ్యాటింగ్ చేయడం ద్వారా అతడు వామప్ మ్యాచ్లో శతకం సాధించగలిగాడు.
వామప్ మ్యాచ్లో దేవ్దత్ పడిక్కల్(142 నాటౌట్) భారీ శతకంతో కోలుకున్న భారత జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండోరోజు ఓవర్ నైట్ స్కోర్ 357/6 వద్దే ఆటను ఆపేసిన టీమిండియా.. శ్రీలంకను బ్యాటింగ్కు ఆహ్వానించింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన లంకను పేసర్లు అకీబ్ నబీ, సిరాజ్లు వికెట్ల వేటతో దెబ్బకొడితే మ్యాచ్పై భారత్ పట్టు సాధించడం ఖాయం.