Harish Rao | కాళేశ్వరం నుండి వచ్చే గోదావరి జలాలు ప్రజల కండ్లకు కనబడుతున్నా.. సీఎం రేవంత్ రెడ్డి కండ్లకు మాత్రం కనబడడం లేదా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పటేల్ గార్డెన్లో సిద్దిపేట లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ వారికి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. నిత్యం కాలువలు, కెనాల ద్వారా సాగు తాగు నీరు ప్రజలకు అందుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం కూలిపోయిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడని మండిపడ్డారు.
రాజకీయంగా బీఆర్ఎస్పై బురద చల్లడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాలేశ్వరం జలాలు సిద్దిపేటకు రావడంతోనే పెద్ద ఎత్తున పంట పండిందని, ధాన్యం నిల్వ ఉంచడానికి గోదాములు నిండిపోయి ధాన్యం తరలించడానికి కనీసం లారీలు కూడా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ పాలన కమిషన్లతోనే కొనసాగుతుందన్నారు. గురుకులాల్లో కోడిగుడ్లతో మొదలుకుంటే విద్యార్థులు వేసుకునే బూట్లు, యూనిఫామ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిలో కమిషన్లో పడుతున్నారని మండిపడ్డారు.
రవాణా శాఖ కార్యాలయంలో వాహనాలకు సంబంధించి రేడియం స్టిక్కలను సైతం అతికించడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. గతంలో ఒక్క వాహనానికి రేడియం స్టిక్కర్ చేస్తే వెయ్యిలోపే అయ్యేదని ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన రేడియం స్టిక్కర్ల నిర్ణయంతో కనీసం 6 వేల నుంచి 7 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. దీంతో వాహనదారులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రానున్నది బీఆర్ఎస్ సర్కారేనన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
లారీ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు డ్రైవర్స్, సిబ్బంది తప్పకుండా ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తన సొంత డబ్బులతో కండ్ల అద్దాలు ఇప్పించడంతోపాటు అవసరమైతే కంటి ఆపరేషన్లు సైతం చేయిస్తానన్నారు. అలాగే వ్యక్తిగత ఇన్సూరెన్స్ చేపిస్తానన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నిత్యం వాకింగ్తోపాటు యోగా లాంటివి తప్పకుండా చేయాలన్నారు. సిద్దిపేట లారీ అసోసియేషన్ వారికి లారీల పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించే విధంగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


