UP Woman : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. తన ప్రియుడితో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా ఏడుస్తున్నాడని మూడేళ్ల కొడుకును హత్య చేసింది కసాయి తల్లి. ఈ ఘటన జూన్ 28న, ఉత్తర ప్రదేశ్, బల్దేవ్ పోలీస్ స్టేషన్ ఏరియాలోని చౌలి గ్రామంలో జరిగింది. దీనిపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలిని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణ మురళి గుప్తా అనే వ్యక్తి స్తానికంగా ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. జూన్ 28న అతడి భార్య రుచి జిందాల్ ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతోంది.
లవర్తో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో వారి మూడేళ్ల కొడుకు ఆపకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఈ సమయంలో తీవ్ర కోపానికి గురైన రుచి.. తన కొడుకును గొంతు నులిమి చంపేసింది. ఈ ఘటనలో బాలుడు స్పృహ తప్పిపడిపోయాడు. వెంటనే ఆందోళనకు గురైన ఆ మహిళ తమ కొడుకు అనారోగ్యానికి గురై, స్పృహ తప్పి పడిపోయాడని, స్పందన లేదని భర్త కృష్ణ మురళికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో వెంటనే అతడు తన మూడేళ్ల కొడుకును వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లారు. చివరకు మధురలోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు మరణించినట్లు చెప్పారు. ఈ సమయంలో బాలుడి మృతిపై తండ్రికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు కలగలేదు. అంతకుముందు రోజు పోలియో చుక్కలు వేయించడం వల్ల కూడా బాలుడు అనారోగ్యానికి గురయ్యాడని భావించి, చివరకు అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం తల్లి రుచి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె బావ గోవింద్ గుప్తా తన ఫోన్ చెక్ చేశాడు. అందులో ఒక వ్యక్తికి ఆమె తరచూ కాల్ చేసినట్లు గుర్తించారు.
దీంతో బాలుడి మృతిపై అనుమానం కలిగింది. ఇదే సమయంలో ఆమె తన ప్రియుడితో కొడుకును హత్య చేసిన ఘటన గురించి వివరిస్తుండగా ఆమె భర్త విన్నాడు. దీంతో వారు రుచి జిందాల్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె తన నేరం అంగీకరించినట్లు పోలీసులు చెప్పారు. ఇదే సమయంలో బాలుడి పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు. బాలుడి పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. అయితే, ఇంకా నిందితురాలిని అరెస్టు చేయలేదని వెల్లడించారు.