HPCL : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ సిలిండర్ల (LPG cylinders) ను అతిభద్రంగా దాచుకుంటున్నాం. సిలిండర్ అయిపోతే మళ్లీ ఎంత టైమ్ పడుతుందోనని ముందే బుక్చేసి అడ్వాన్స్గా నిండు సిలిండర్ పెట్టుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర (Maharastra) లో 3,000 గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. సిండిర్లు కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయ్యాయి.
మహారాష్ట్రలో కొన్నిరోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే రాయగఢ్ జిల్లాలోని హెచ్పీసీఎల్ పాతాళ్గంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ జలమయమైంది. ప్లాంట్ గోడ కూలిపోవడంతో నదినీరు ప్లాంట్లోకి చొచ్చుకొని వచ్చింది. ఈ వరద ప్రవాహ తీవ్రతకు మూడు వేల వరకు సిలిండర్లు పాతాళగంగలో కొట్టుకుపోయాయి. వాటిలో కొన్ని ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. ఒడ్డుకు కొట్టుకొచ్చిన సిలిండర్లను ఎవరూ తీసుకెళ్లవద్దని రాయగఢ్ జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.
నదిలో కొట్టుకొచ్చిన సిలిండర్లలో గ్యాస్ ఉందో లేదో, సురక్షితమైన స్థితితో ఉన్నాయో లేదో చెప్పలేమని, అందువల్ల వాటిని తీసుకెళ్లడం ప్రమాదానికి దారితీయవచ్చునని కలెక్టర్ హెచ్చరించారు. నది ఒడ్డుకు కొట్టుకువచ్చిన గ్యాస్ సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికే కొట్టుకుపోయిన సిలిండర్లను గుర్తించి, స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.