Thief | జహీరాబాద్, ఫిబ్రవరి 1 : చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించాలని తాళాలు వేసిన ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న కర్ణాటకకు చెందిన వ్యక్తిని న్యాల్కల్ మండలం హద్నూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. జహీరాబాద్ రూరల్ సీఐ జక్కుల హనుమంతు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి అరెస్టుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ఈ నెల 27వ తేదీన న్యాల్కల్ మండలం ఖలీల్ పూర్ గ్రామానికి చెందిన జైపాల్ రెడ్డి ఇండ్లకు తాళాలు వేసి ఉండడంతో కర్ణాటకలోని బీదర్ పట్టణ సమీపంలోని తాలూడి కాలనీకి చెందిన షేక్ మహబూబ్ (32) అనే వ్యక్తి దొంగతనాలకి పాల్పడి బంగారం నగదును ఎత్తుకెళ్లాడు. ఈ విషయమై బాధితుల ఫిర్యాదు మేరకు హద్నూర్ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదివారం మండలంలోని గంగువార్ చౌరస్తాలో ఎస్ఐ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఆటో డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా, నడుపుకొంటూ వచ్చి వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు.
నిందితుడు కర్ణాటకలోని బీదర్ పట్టణానికి చెందిన తాలూడి కాలనీ చెందిన షేక్ మహ్మద్ గా గుర్తించారు. నిందితుడు నుంచి రెండు తులాలన్నార బంగారం వేయి రూపాయల నగదు ఆటోను స్వాధీనం చేసుకున్నారు . ఈ మేరకు నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ కేసును చేదించిన హద్నూర్ ఎసై దోమ సుజిత్, సిబ్బంది సేవాలాల్, అభినేర్ , తమ్మాలి రాజశేఖర్ , సాయి కిరణ్ , మహేష్ బాబు పాండులను సీఐ జక్కుల హనుమంతు అభినందించారు.