Indiramma House | శివ్వంపేట, మార్చి 23 : శివ్వంపేట మండలంలోని బిక్యా తండా గ్రామపంచాయతీకి చెందిన ధనావత్ లక్ష్మి అనే పేద మహిళ ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుని కూడా బిల్లు అందక ఇబ్బందులు పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కూలి పనులు చేసుకుంటూ గుడిసెలో జీవనం సాగిస్తున్న లక్ష్మిని అధికారులు నిర్వహించిన సర్వేలో గుర్తించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.
అధికారులు ఇంటి స్థలానికి వచ్చి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ముగ్గు పోసి కొలతలు తీసి నిర్మాణ పనులు ప్రారంభించమని సూచించారు. దీంతో ధనావత్ లక్ష్మి అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని చేపట్టి స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసింది. నిర్మాణం పూర్తయిన తరువాత అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్లినట్లు ఆమె తెలిపింది. ఇంటి నిర్మాణానికి సంబంధించి రెండు బిల్లులు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా రాకపోవడంతో లక్ష్మి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. బిల్లు కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వస్తుంది…వస్తుంది అంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆమె ఆరోపించింది.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ ఎదుట తన గోడును వినిపించిన లక్ష్మి ‘మేడం… దండం పెడతా… అప్పు చేసి ఇల్లు కట్టాను.. బిల్లు మాత్రం రావడం లేదు. నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి నడుచుకుంటూ కార్యాలయానికి వస్తున్నాను. ఎన్నిసార్లు వచ్చినా బిల్లు వస్తుందని చెప్పి పంపిస్తున్నారు. గుడిసె కూల్చి ఇప్పుడు పక్కింటి వారి ఆవరణలో ఉంటున్నాను అంటూ కన్నీటి పర్యంతమైంది.
ఈ విషయంపై ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ స్పందిస్తూ.. మరో తండాలో గతంలో ఇందిరమ్మ ఇల్లు లక్ష్మి పేరుపై తీసుకున్నట్లు రికార్డుల్లో చూపిస్తోందని తెలిపారు. అయితే విచారణలో ఈ లక్ష్మి బిల్లు తీసుకోలేదని తేలిందని, పేరు విషయంలో పొరపాటు జరిగిందని పేర్కొన్నారు. పూర్తి వివరాలతో పై అధికారులకు లేఖ పంపించి సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.

Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్