Padma Devender Reddy | 4 రోజుల్లో సింగూరు నుండి ఘనపూర్ ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని లేదంటే మెదక్, నర్సాపూర్ నియోజక వర్గాల రైతులతో పెద్ద ఎత్తున మెదక్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హెచ్చరించారు.
సోమవారం మెదక్ కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం వారు కలెక్టరేట్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు కంట కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటి మాటికి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లా అంటారు తప్ప ఇక్కడి రైతుల పరిస్థితి పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీళ్లు ఉన్నపటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం హయాంలో సమయానికి నీళ్లు వదిలించామని చెప్పారు. గత పది సంవత్సరాల్లో రైతులు ఎన్నడూ రోడ్డెక్కిన పరిస్థితి లేదన్నారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మ సాగర్ నుండి హల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫ్రొటోకాల్ పాటించండి..
నర్సాపూర్ నియోజక వర్గంలో దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగ్, చేగుంట, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలాలలో అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలను కాదని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎమ్మెల్యేలు కానీ అధికార పార్టీ ఇంచార్జీలు, నాయకులు చేస్తున్నారని, అధికారులు ప్రొటోకాల్ పాటించండం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఎస్కార్ట్ ఇవ్వకుండా అధికార పార్టీ నేతలకు పోలీసులు ఎస్కార్ట్ ఇస్తున్నారని మండి పడ్డారు.
ప్రొటోకాల్ విషయంలో సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగకుండా చూడాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున గౌడ్, బట్టి. జగపతి, జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు యం లావణ్య రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, కోకన్వీనర్ కృష్ణ గౌడ్, లింగారెడ్డి జుబేర్, న్యాయవాది జీవన్ రావు, మాజీ కౌన్సిలర్లు జయరాజ్ ఆర్కే శ్రీనివాస్, మాయ మల్లేశం, ఏడుపాయల మాజీ చైర్మన్ బాలగౌడ్, మెదక్ నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల మాజీ జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Juluri Gourishankar | జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ ఆవిష్కరణ
Student | అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత.. యమునా నదిలో శవమై తేలిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని