Burgampahad | బూర్గంపహాడ్, ఆగస్టు 5: ప్రతి ఏడాది గోదావరి వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల ప్రజలకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి వరదల నుంచి మండలంలోని పలు గ్రామాలను రక్షించేందుకు కరకట్ట (రక్షణ గోడ) నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి దశలో సుమారు 270 నుంచి 300 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
సంజీవరెడ్డిపాలెం నుంచి బూర్గంపహాడ్ మీదుగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వరకు 17 మీటర్ల ఎత్తుతో, 12 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మించనున్నారు. భూమి అడుగు భాగంలో సుమారు 180 మీటర్ల వెడల్పుతో, పైభాగంలో ఐదు మీటర్ల వెడల్పుతో ఈ రక్షణ గోడను నిర్మించనున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
కరకట్ట నిర్మాణంతో పాటు మండలంలో వర్షపు నీరు గోదావరిలోకి వెళ్లేలా రెండు పంప్హౌస్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సమీపంలోని పెదవాగు నుంచి ప్రారంభమయ్యే కరకట్ట, సంజీవరెడ్డిపాలెం సమీపంలోని దోమలవాగు వరకు నిర్మించనున్నారు.
ఈ కరకట్ట నిర్మాణంతో సంజీవరెడ్డిపాలెం, బూర్గంపహాడ్, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాలతో పాటు మండల కేంద్రానికి గోదావరి, కిన్నెరసాని వరదల ముప్పు నుంచి రక్షణ లభించనుంది. ప్రతి ఏడాది వరదల కారణంగా పంటలు, ఇళ్లు ముంపునకు గురవడం, ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
కరకట్ట నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే భద్రాచలం సబ్కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలోపు భూసేకరణ సర్వే పనులు ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. తొలి దశలో 270 నుంచి 300 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు వెల్లడించారు. వారం రోజుల్లో భూసేకరణకు పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.