Dumping Yard | నర్సాపూర్, ఫిబ్రవరి 18 : నర్సాపూర్ పట్టణ శివారులోని మెదక్ మార్గంలో ఉన్న డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకున్నది. ఈ విషయాన్ని గమనించిన పట్టణవాసులు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. డంపింగ్ యార్డులో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు ఇతర చెత్తాచెదారం అగ్నికి ఆహుతయ్యాయి.
కాగా పారిశ్రామిక వ్యర్ధాలను తీసుకువచ్చి డంపింగ్ యార్డులో పడేసి గుట్టుచప్పుడు కాకుండా తగలబెడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా..? లేక చెత్త పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో కావాలనే ఎవరైనా తగలబెట్టారా..? అని అనుమానం వ్యక్తం అవుతుంది.
డంపింగ్ యార్డులోని చెత్తను విచ్చలవిడిగా పారవేయకుండా రీ-సైక్లింగ్ చేయాలని పలువురు బావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరుగకున్నా, మున్ముందు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే వాతావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునఃరావృతం కాకుండా చూడాలని పట్టణ వాసులు కోరారు.
డంపింగ్ యార్డులో మంటలు..