Mammootty | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన అనారోగ్యంపై వస్తున్న వార్తలపై తొలిసారి స్పందించాడు. గత ఏడాది జూన్ సమయంలో ఆయన అనారోగ్యానికి గురై దాదాపు నాలుగు నెలల పాటు సినిమాలకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తొలిసారిగా మీడియాతో మాట్లాడారు.
తాను చాలా కాలం పాటు రుచి, వాసన చూసే శక్తిని కోల్పోయానని, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఆ ఇంద్రియ జ్ఞానాన్ని తిరిగి పొందుతున్నానని తెలిపారు. కంటి చూపు, వినికిడితో పాటు శ్వాస తీసుకునేటప్పుడు వాసనను గుర్తించగలగడం కూడా ఒక గొప్ప వరమని, అటువంటి సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ అర్థమవుతుందని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ముఖ్యంగా వినికిడి శక్తి లేని వారి బాధ వర్ణనాతీతమని, మనం ఇతరుల గొంతును వినగలుగుతున్నాం కాబట్టే వారిని మెల్లగా మాట్లాడమని అడగగలమని, కానీ ఆ సామర్థ్యం లేని వారికి శబ్దాల మధ్య తేడా తెలియదని పేర్కొన్నారు. ప్రస్తుతం మమ్ముట్టి పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్లలో బిజీ అయ్యారు.
మహేష్ నారాయణన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పేట్రియాట్’ (Patriot). ఈ సినిమా కోసం మమ్ముట్టి ఇటీవలే డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేశారు. ఈ సినిమా మలయాళ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలవనుంది. ఎందుకంటే సుమారు 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ కలిసి పూర్తిస్థాయి పాత్రల్లో స్క్రీన్ను పంచుకుంటున్నారు. వీరిద్దరితో పాటు విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తుండటం విశేషం. నయనతార, కుంచాకో బోబన్ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.