భువనగిరి అర్బన్, ఆగస్టు 17: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 19న భువనగిరిలోని అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేపడుతున్నట్లు ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భువనగిరిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొంగిడి సునీతా మహేందర్రెడ్డి మాట్లాడుతూ..ఈ నెల 19న భువనగిరిలోని అమర వీరుల స్థూపం వద్ద ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.
ఉద్యోగులు కేవలం ఉద్యోగులు మాత్రమే కాదని, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి పాత్ర మరువలేనిదన్నారు. రిటైర్టు ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధ ఖైదీలను చూసినట్టు చూస్తోందన్నారు. 19న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉద్యోగ, రిటైర్టు ఉద్యోగుల ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఏనుగు రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. 60 ఏండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన వారిలో ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమన్నారు. 53 రోజుల పాటు ఉద్యమం చేపట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారన్నారు.
కరోనా కష్టకాలంలో సైతం ఉద్యోగులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు. ఉద్యమం నడిపిన నాయకుడే ముఖ్యమంత్రి కావడంతో 2015లో 10వ పీఆర్సీ సిఫార్సు చేసిన 29 శాతానికి బదులుగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించారన్నారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేస్తే చివరకు ఒకటో తేదీన జీతం రావడం తప్పితే ఇచ్చిన ఏ ఒక హామీ అమలు కావడం లేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేయాలని, కానీ మూడేండ్లు కావొస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు.
పెండింగ్ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఉద్యోగులు సీఎంను అడిగితే తనను కోసుకు తిన్నా ఒక్క రూపాయి కూడా రాదని, ప్రభుత్వం దివాలా తీసిందని, తాను ఎకడికైనా వెళ్తే చెప్పులు ఎత్తుకపోయేవాడిలా చూస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రే మాట్లాడటం అత్యంత దిగజారుడు విషయమన్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీలైన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు. ప్రమోషన్లు సీనియారిటీ ఆధారంగా, శాఖల వారీగా పెండింగ్ పదోన్నతులపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్న డిమాండ్తో ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ధర్నాను అం దరూ విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు ఏవీ కిర ణ్కుమార్, జనగాం పాండు, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, నాయకులు సూరేపల్లి రమేశ్, ర్యాకల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.