Sunitha lakshma reddy | నర్సాపూర్ / శివంపేట : జూలై 13: తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపక్షం కోరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
సోమవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కన్నెపల్లి పంప్హౌస్ను వెంటనే పూర్తి స్థాయిలో నడపాలని, సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఆనవాళ్లను చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
త్వరలోనే ‘హల్దీ బచావో’..
రైతుల పంట పొలాల్లో నీరు పారించండి అని ప్రతిపక్ష నాయకులుగా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరితే వారి రక్తాన్ని పారిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషలాడడంపై మండిపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే “హల్దీ బచావో” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఇటీవల పోక్సో కేసు నిందితుడు బెయిల్పై వచ్చి ఆరుగురు వ్యక్తులను హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి హోదాలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
నిందితుడిని సకాలంలో పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, బాధిత కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పోలీసింగ్కు దేశవ్యాప్తంగా ఉత్తమ గుర్తింపు లభించిందని, ప్రస్తుతం మాత్రం శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేయడంపైనే దృష్టి సారించిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్ మెంబర్ షిప్ నియోజకవర్గ ఇంచార్జ్ నరహరి రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.