Ramayana | నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ‘రామాయణ’ ట్రైలర్పై ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ‘రామ్ యుగ్’ (Ram Yug) ఆరంభమని, అధర్మంపై ధర్మం ఎప్పటికీ గెలుస్తుందనే శక్తివంతమైన సందేశాన్ని ఈ చిత్రం ఇస్తుందని ఆయన కొనియాడారు. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ ట్రైలర్లోని అద్భుతమైన విజువల్స్, నటీనటుల బలమైన అభినయం, ముఖ్యంగా హన్స్ జిమ్మర్ – ఏఆర్ రెహమాన్ ల అద్భుతమైన మ్యూజికల్ కొలాబరేషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సినిమా ఇండస్ట్రీ నుండి ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రశంసల ప్రవాహం కొనసాగుతుండగా, తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ట్రైలర్ చూసి ఎంతగానో ఇంప్రెస్ అయిన ఆయన, “ఇది రామ్ యుగ్ ఆరంభం. ఇదొక ట్రైలర్ మాత్రమే కాదు, అధర్మంపై ధర్మం ఎప్పటికీ విజయం సాధిస్తుందనే శాశ్వత జ్ఞాపిక” అంటూ రాసుకొచ్చారు. ఈ ట్రైలర్లో రాముడిగా ప్రశాంతమైన రూపంలో రణ్బీర్ కపూర్ కనిపించగా, సీత పాత్రలో సాయి పల్లవి హుందాగా, అద్భుతంగా ఆకట్టుకున్నారు. ఇక రావణాసురుడిగా నటిస్తున్న యష్ లుక్ ఆయన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. మంచికి, చెడుకి మధ్య జరిగే పోరాటంతో పాటు రామసీతల భావోద్వేగ బంధాన్ని కూడా ట్రైలర్ అందంగా ఆవిష్కరించింది.
ఈ సినిమాను నితీశ్ తివారీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యష్లతో పాటు రవి దూబే, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, అరుణ్ గోవిల్ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, వీఎఫ్ఎక్స్ స్టూడియో డీఎన్ఈజీ, యష్ మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత హన్స్ జిమ్మర్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా, మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది.