Theft | నర్సాపూర్, ఏప్రిల్ 1 : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి బంగారంతోపాటు వెండి వస్తువులు నగదు చోరీ చేసిన సంఘటన నర్సాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన అజార్ ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా పగలగొట్టి అందులో ఉన్న ఐదు తులాల బంగారంతోపాటు 15 తులాల వెండి నగలు, 50 వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
బుధవారం పక్కన ఉన్న వారు ఇంటి తాళాలు పగలగొట్టిన విషయం గమనించి అజార్ ఖాన్ కుటుంబీకులతోపాటు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి తెలిపారు.