వరంగల్ : ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ వరంగల్కు రానున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా కార్పొరేషన్ లోని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పనులపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్లోని మంత్రి అర్ అండ్ బీ అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. ఈ మధ్య హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ తో జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ఆయా పనుల ప్రగతి తీరుని అధికారులతో చర్చించారు. ఉగాది నుంచి వరంగల్ లో ప్రతి ఇంటింటికీ మంచినీటిని ప్రతి రోజూ ఇవ్వాలన్న నిర్ణయంలో భాగంగా 95వేల కనెక్షన్లు ఇచ్చామన్నారు.
అయితే, స్లం ఏరియాల్లో తప్పనిసరిగా కనెక్షన్లు అందేలా చూడాలన్నారు. రూ.1 కే కనెక్షన్ కింద ప్రతి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, మంచినీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు.
ఒక్క మిషన్ భగీరథ పథకం కిందే గ్రేటర్ వరంగల్ మహా నగర పాలక సంస్థలో ఇప్పటి వరకు రూ.1000 కోట్లు ఖర్చు చేసినట్లు వారు వివరించారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు పక్కా ఏర్పాట్లు చేయాలని మంత్రులు జిల్లా కలెక్టర్ వరంగల్ నగర కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతిలను ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
రైతులు డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి
బీచ్లో శ్రద్దాదాస్ షికార్లు..ఫొటోలు వైరల్
త్వరలో టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి
మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం
గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్