BRSV | ఊట్కూర్, జూన్ 20: ఊట్కూర్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లను అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్వీ నారాయణపేట్ జిల్లా అధ్యక్షుడు శివరాజ్ రెడ్డి విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నా ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తోందని మండిపడ్డారు.
శనివారం ఊట్కూర్ మండల విద్యాధికారికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. పుస్తకాలు, యూనిఫాంలు, ఇతర విద్యా సామాగ్రిని కూడా పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెచ్చి తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువుల కోసం అప్పుల పాలవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు కుమ్మరి సచిన్, అభిలాష్ రెడ్డి, షేక్ షమీ, ఇర్షాద్, విద్యార్థులు పాల్గొన్నారు.