నాగపూర్ : మహారాష్ట్రలోని నాగపూర్కు చెందిన ఓ విద్యార్థికి.. అబుదాబి సెంటర్ అడ్రస్తో నీట్ అడ్మిట్ కార్డు(NEET-UG Admit Card) జారీ అయ్యింది. అబూ దాబిలో సెంటర్ ఎగ్జామ్ను కేటాయించడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ విద్యార్థికి కొత్త అడ్మిట్ కార్డు జారీ చేసింది. స్థానిక సిటీలోనే పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది. జూన్ 21వ తేదీన నీట్ పునపరీక్ష జరగనున్న విషయం తెలిసిందే. కొత్త అడ్మిట్ కార్డులు జారీలో సెంటర్ మారడంతో విద్యార్థి ఆందోళనకు గుర్యారు. అప్లికేషన్లో టెస్ట్ సెంటర్ ప్రిపరెన్స్ మహారాష్ట్రకే పరిమితం అయినా.. అబుదాబి సెంటర్ ఎలా చూపించిందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కేసులో సమస్యను పరిష్కరించినట్లు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ కన్ఫర్మ్ చేశారు. ఆ అభ్యర్థికి నాగపూర్లోనే సెంటర్ను కేటాయించినట్లు చెప్పారు.
అబ్దుల్లా మొహమ్మద్ తాలిబ్ అనే విద్యార్థి మే 3వ తేదీన నీట్ పరీక్షను నాగపూర్లోని సరస్వతి విద్యాలయలో రాశారు. అయితే పేపర్ లీక్ నేపథ్యంలో రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కొత్త అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకున్న తాలిబ్ షాక్ అయ్యాడు. యూఏఈలోని అబుదాబి స్కూల్లో సెంటర్ కేటాయించడం పట్ల ఆందోళనకు గురయ్యాడు. ఫస్ట్ ప్రిఫరెన్స్గా నాగపూర్ ఆ తర్వాత వార్దా, భాంద్రా సిటీలను అభ్యర్థి ఎంపిక చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విదేశీ టెస్ట్ సెంటర్ను ఎంపిక చేయలేదన్నారు. మా పిల్లోడిని విదేశాలకు పంపాలన్న ఉద్దేశం లేదని, అతనికి పాస్పోర్టు లేదని, ట్రావెల్ ఏర్పాట్లు చేసే సమయం కూడా లేదని తండ్రి పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్ విషయంపై ఎన్టీఏ హెల్ప్లైన్ను కాంటాక్ట్ అయ్యామని, ఫిర్యాదు నమోదు చేయడంతో కొత్త అడ్మిట్ కార్డు జారీ అయినట్లు తెలిపారు. టెక్నికల్ సమస్య వల్ల అడ్మిట్ కార్డులో అడ్రస్ మారినట్లు ఎన్టీఏ అధికారులు చెప్పారు.