Baru Srinivas Rao | | బారు శ్రీనివాసరావు.. ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో పుట్టారు. వరంగల్లో చదువుకున్నారు. ఐఐటీలో డాక్టరేట్ సాధించారు. టీసీఎస్లో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం కాప్ జెమినీలో అంతర్జాతీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రయాణాన్ని ‘గమనం-గమ్యం’లో వివరంగా రాసుకున్నారు. జీవితంలో ఎదగాలనుకునేవారికి ఈ పుస్తకం గెలుపు సిలబస్. ఆ సారాంశం సంక్షిప్తంగా..
మాది కొల్లాపూర్. మాకో పెద్ద ఇల్లు ఉండేది. మా చదువుల కోసం నాన్న వరంగల్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. నిజానికి, నాన్నకు హైదరాబాద్ రావాలని ఉండేది. కానీ మహానగరంలో ఖర్చులు ఎక్కువ. ఆ భయంతో అటు నగరమూ, ఇటు మహా పట్టణమూ కాని వరంగల్ను ఎంచుకున్నారు. ఓరుగల్లు అప్పటికే చదువులకు పేరు. మంచి విద్యాసంస్థలు ఉండేవి. మేము కిషన్పురాలో ఉండేవాళ్లం. నాన్న పనిచేసే స్కూలు వరంగల్లో ఉండేది. రోజూ సైకిల్ మీద ఇరవై కిలోమీటర్ల ప్రయాణం. ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో చదివిన నన్ను నేరుగా మూడో తరగతిలో వేసేశారు. అదీ తెలుగు మీడియం. దీంతో అమ్మ బాలమిత్ర, చందమామ కథలతో నాకు తెలుగు నేర్పించింది.
* * *
మాది మూడు గదుల అద్దె ఇల్లు. అతిథుల తాకిడి ఎక్కువ. బీఎడ్ చదవడానికి ఇద్దరు మేనమామలు వచ్చారు. అయినా అమ్మానాన్న అందరి పట్లా ఆప్యాయత చూపేవారు. నిజమే, అప్పుడు ఇళ్లు చిన్నవి. మనసులు పెద్దవి. ఇప్పుడు ఇళ్లు పెద్దవి. మనసులేమో చిన్నవి. నాన్న జీతానికి, ఇంటి అవసరాలకు ఎక్కడా పొంతన ఉండేది కాదు. ప్రతి పైసా గీచిగీచి ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి. ఓసారి స్కూల్ ఖాతాలో మూడువందల రూపాయలు తేడా వచ్చింది. ఆ మొత్తం నాన్నే కట్టాల్సి వచ్చింది. అమ్మ కన్నీళ్లు, నాన్న సంజాయిషీ.. ఇప్పటికీ మరిచిపోలేను. ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలో ఎన్ని కలతలు సృష్టిస్తాయో అప్పుడే అర్థమైంది. చంద్రుని మీద మనిషి కాలుమోపడం, తెలంగాణ ఉద్యమం.. ఆ రోజుల్లో రెండు ముఖ్య ఘట్టాలు. మా ఇంటి చుట్టుపక్కల బడికెళ్లే పిల్లలు తక్కువ. దీంతో పుస్తకాలే నా నేస్తాలుగా మారాయి.
* * *
అన్నట్టు, మా చిన్న తాతగారి పేరు బారు శ్రీనివాసరావు. విద్యావేత్త. స్వాతంత్య్రం వచ్చిన ఐదేండ్లకు వయోజన విద్య మీద అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం కొందరు నిపుణులను అమెరికా, ఐరోపా పంపింది. ఆ బృందంలో ఆయనా ఉన్నారు. ప్రతి క్లాస్లో చాలామంది శ్రీనివాసులు ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు, స్నేహితులు ‘బారు’ అని పిలిచేవారు. అదే స్థిరపడిపోయింది. పదో తరగతిలో నేను జిల్లా ఫస్టు. హనుమకొండ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేర్పించారు నాన్న. దివంగత పీవీ నరసింహారావు అక్కడే చదువుకున్నారు. నా మీద నాకున్న అతి విశ్వాసం కారణంగా ఐఐటీలో సీటు రాలేదు. ఆర్యీసీలో అడ్మిషన్ దొరికింది. ముందు మెకానికల్లో చేరి, ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్కు మారిపోయాను. వరంగల్ గాలి మహిమ కావచ్చు.. కమ్యూనిస్టు సిద్ధాంతాలు, విప్లవ సాహిత్యం బాగానే పరిచయం అయ్యాయి. నక్కలగుట్టలో ఉన్నప్పుడు మా ఎదురిల్లు కాళోజీ సోదరులదే.
* * *
బీటెక్ తర్వాత కొంతకాలం బజాజ్ కంపెనీలో ఉద్యోగం చేశాను. కానీ నచ్చలేదు. దీంతో ఖరగ్పూర్ ఐఐటీలో ఎంటెక్లో చేరాను. ల్యాబ్లో ఒకట్రెండు కంప్యూటర్లే ఉండేవి. నెలకు ఓ రెండు గంటలు సిస్టమ్ ముందు కూర్చోగలిగితే గొప్పే. క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా నాకు టీసీఎస్లో ఉద్యోగం వచ్చింది. చెన్నైలో కొలువు. అప్పట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఓ చిన్న కంపెనీ. ఉద్యోగులకు ఇన్ని సౌకర్యాలు లేవు. చెన్నపట్నంలో ఓ యాభైమంది సిబ్బంది ఉండేవారు. వర్షం పడితే ఆఫీసులోకి నీళ్లు వచ్చేవి. టాయిలెట్లో మురుగు పొంగిపొర్లేది. నాలుగేండ్ల తర్వాత విదేశాలకు పంపుతామంటూ కబురు పెట్టారు. ఏ అమెరికానో అనుకుని పొంగిపోయాను. తీరా చూస్తే గల్ఫ్ దేశం.. బహ్రెయిన్. తొమ్మిది నెలల ప్రాజెక్టు పూర్తి చేసుకుని వచ్చేసరికి.. కొన్ని కొత్త స్నేహాలు, మరికొన్ని చేదు అనుభవాలూ! వస్తూవస్తూ ఒక టూ-ఇన్-వన్ అలారం క్లాక్, అమ్మకు వదినకు చీరలు కొన్నాను. మొత్తం ఖర్చు రెండువందల దీనార్లు. ఆ తర్వాత అమెరికా వెళ్లమన్నారు. పెండ్లి తర్వాత, మా ఆవిడతో కలిసి శాన్ఫెరాలో కాపురం పెట్టాను. కొన్నాళ్లకు మా ఆవిడకు హిందుస్థాన్ ఏరోనాటికల్లో ఉద్యోగం వచ్చింది. దీంతో నేను కూడా ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చేశాను. శ్రీమతిగారికి ఆ కొలువు పెద్దగా నచ్చలేదు. మళ్లీ అమెరికా వచ్చేశాం. అమెరికాలో బియ్యం లావుగా ఉంటాయన్నది నా ప్రధాన ఫిర్యాదు. ‘దానే దానే పే లిఖాహై, ఖానే వాలేకా నామ్’ సూత్రం ప్రకారం.. అమెరికా దొడ్డుబియ్యం మీద నా పేరు ఇంకా రాసిపెట్టుంది. టీసీఎస్లో వివిధ హోదాల్లో పనిచేశాను. అనేక ప్రాజెక్టులకు నాయకత్వం వహించాను. చాలా దేశాలు చుట్టొచ్చాను. టీసీఎస్లో దీర్ఘకాల ఉద్యోగం తర్వాత.. మనసు మార్పును కోరుకుంది. సింటెల్ కంపెనీ ఇండియా సీవోవోగా అవకాశం వచ్చింది. ఆఫీసు ముంబైలో.
* * *
‘నీ ఆధ్యాత్మిక పథంలో నువ్వు రుషివి కావచ్చు. కానీ దేశాన్ని పాలించేటప్పుడు రాజువే. ఎప్పుడు రుషిలా ఉండాలి, ఎప్పుడు రాజులా ఉండాలనే ఎరుక చాలా అవసరం’ అని చెప్పేవారు సద్గురు శివానందమూర్తి. ఆ సూత్రాలే నన్ను నడిపించాయి, నడిపిస్తున్నాయి. నాలోని రుషి నన్ను నిత్య జిజ్ఞాసిగా ఉంచుతాడు. మా ఆవిడ ఐఐటీ ముంబైలో కంప్యూటర్స్ విభాగంలో పనిచేసేవారు. దీంతో నేను తరచూ ఐఐటీకి వెళ్లాల్సి వచ్చేది. ఆ వాతావరణం నన్ను పీహెచ్డీ చేయమంటూ ప్రోత్సహించింది. సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్లో పరిశోధన చేయాలనుకున్నా. మూడేండ్ల పరిమిత కాలంలోనే అనుకున్నది సాధించాను. అనేకానేక కారణాల వల్ల సింటెల్లో నాకు అసౌకర్యంగా అనిపించడంతో ఉద్యోగం మారే ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలో కాప్ జెమినీ నుంచి పిలుపు వచ్చింది. అది ఫ్రెంచ్ కంపెనీ. అప్పటికి నష్టాల్లో ఉంది. అయినా ధైర్యంగా దూకేశాను. ఇండియా సీయీవోగా బాధ్యతలు అప్పగించారు. ఓసారి మా ఉన్నతోద్యోగి ఒకరు పార్కింగ్ దగ్గర సెక్యూరిటీ గార్డుతో గొడవ పెట్టుకున్నాడు. చేయి చేసుకున్నాడు. అదో సాధారణ విషయం అన్నట్టు చెప్పింది మా హెచ్ఆర్ హెడ్. ఎక్కడో బీహార్ నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన ఓ బక్కజీవికి అన్యాయం జరిగినట్టు మనస్సాక్షి గుర్తుచేసింది. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డుకు క్షమాపణలు చెప్పకపోతే.. అతణ్ని ఉద్యోగం నుంచి తీసేయాల్సి వస్తుందని ఆదేశాలు జారీచేశాను. ఏ స్థాయికి వెళ్లినా, మనం సహానుభూతిని దూరం చేసుకోకూడదు. అదే జరిగితే, ఆ ఎదుగుదల ఎదుగుదలే కాదు. కాప్ జెమినీలో నా ప్రయాణం ఏడేండ్లు సాగింది. త్వరలోనే నా ఐటీ ప్రయాణం నాలుగు దశాబ్దాలకు చేరనుంది. నేను చేరినప్పటికి కాప్ జెమినీ ఉద్యోగులు దాదాపు నాలుగు వందల యాభైమంది. ప్రస్తుతం నలభై అయిదువేలు పైమాటే. ఏడేండ్ల ప్రయాణం తర్వాత.. నా వారసుడిని ఎంపిక చేయమంటూ యాజమాన్యం నుంచి వర్తమానం అందింది. కాప్ జెమినీ కెనడా, లాటిన్ అమెరికా అధిపతి అరుణ జయంతి పేరు సూచించాను నేను. ఆమె తెలుగు వనిత. ఆ తర్వాత ఇంకేవో బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం కాప్ జెమిని ఉత్తర అమెరికా వ్యవహారాలు చూస్తుంటాను. జీవన సహచరి మాలతితో కలిసి అట్లాంటాలో నివసిస్తున్నాను.
* * *
వెనక్కి తిరిగి చూసుకుంటే.. నాకు నేను అరవై అయిదు శాతం నుంచి డబ్భు శాతం మార్కులు వేసుకోగలను. ఏ మనిషికైనా.. అతి విశ్వాసం, అతి ఆత్మన్యూనత రెండూ ప్రమాదకరమే! నాకు ఓ పాతిక శాతం మార్కులు తగ్గడానికి ఆ రెండూ ఓ కారణం కావచ్చు.
“Daily labour App | క్యాబ్ల కోసమే కాదు లేబర్స్ కోసమూ ఓ యాప్.. క్రియేట్ చేసిన జనగామ బిడ్డ”
“komera ankarao | మనుషులకు ఆయువునిచ్చే అడవులకు అండగా మారిన తెలుగోడు”