ములుగు: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రామప్ప ఆలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలంపేటలోని కాకతీయుల కాలంనాటి రామప్ప దేవాలయంలో పురావస్తు శాఖ అధికారులు యోగాసనాలు వేశారు. యోగా ప్రత్యేకతను వివరిస్తూ.. దానివల్ల జరిగే ప్రయోజనాలను తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో ప్రతిఒక్కరు యోగాను తమ దినచర్యలో భాగంగా చేర్చుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. యోగా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. యోగా ద్వారా ప్రతి దేశం, సమాజం స్వస్థత పొందుతున్నాయని తెలిపారు. యోగాను ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోని ప్రతి మూలా లక్షలాది మంది యోగా సాధకులుగా మారారని ప్రధాని అన్నారు. యోగాతో రోగ నిరోధక వ్యవస్థ పెరుగుతుందని, దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని వెల్లడించారు. కరోనా నుంచి రక్షణకు శారీరక దృఢత్వం పెంచుకోవాలన్నారు.
యోగా ద్వారా మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మోదీ చెప్పారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని యోగా పెంపొందిస్తుందని, అంతర చైతన్యం పెంపొందుతుందని వెల్లడించారు. కరోనా వేళ యోగా ఆశా కిరణంగా మారిందని పేర్కొన్నారు. ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని చెప్పారు.
కరోనాతో భారత్ సహా పలుదేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయన్నారు. దీంతో రెండేండ్లుగా బహిరంగ కార్యక్రమాలు లేవని, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సామూహిక కార్యక్రమాలు నిలిచిపోయాయని చెప్పారు. విపత్తు వేళ యోగా పట్ల ప్రజలు ఉత్సాహం కనబరుస్తున్నారని, ‘వన్ వరల్డ్-వన్ హెల్త్’ సాధనకు ఇది ఉపయుక్తమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రపంచవ్యాప్తంగా సామాన్య ప్రజలకు కూడా యోగా యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఆయా ప్రాంతాల భాషలకు అనుగుణంగా యాప్లు వచ్చాయన్నారు.