ఖమ్మం : రోడ్డు ప్రమాదాల నివారణకు ఆయా గ్రామ పంచాయతీ పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ సీఐ సత్యనారాయణరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ పోలీస్ ఠాణాలో పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం రూరల్ ఎస్.ఐ జర్పుల శంకర్రావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం రూరల్ మండల పరిధిలో గ్రామీణ, ప్రధాన రహదారులపై ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని, వీటి నివారణకు ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులతో చర్చించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.
ఏదులాపురం, పెద్దతండా, పోలేపల్లి, గుర్రాలపాడు, గుదిమళ్ల, వెంకటగిరి గ్రామాల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకునే విధంగా తీర్మానాలు చేయాలన్నారు. ఈ గ్రామాలలో ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రహదారుల వెంట వీధి దీపాలు, సీసీ కెమెరాలను, డివైడర్ల ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా ఆయా గ్రామాల పరిధిలో ఉన్న గ్రానైట్, ఇతర పరిశ్రమల వ్యర్ధాలను రోడ్ల వెంట వేయకుండా చూడాలన్నారు.
గ్రామ పంచాయతీ పరిధిలో గల ఈ రహదారుల వెంట ప్రమాదకర వ్యర్ధాలను వదిలి వెలుతున్న వారి సమాచారాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి పాషా, గుర్రాలపాడు కార్యదర్శి శ్రీనివాస్, పెద్దతండా కార్యదర్శి రామకృష్ణ, వెంకటగిరి కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.