ఖమ్మం, ఏప్రిల్ 24 : ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. గడపగడపకు వెళ్లండి.. ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని వివరించి నామా విజయానికి నడుం బిగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం సీక్వెల్ క్లబ్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. ప్రతిఒకరూ క్షేత్రస్థాయిలో పని చేయాలని, నామా గెలుపు కోసం ప్రతి కార్యకర్త నేనే నామా అనుకుని పని చేయాలన్నారు. నామాను మంచి మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ అంతు చూడాలని పిలుపునిచ్చారు.
ప్రజాపాలనను గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. నామా గెలుపుతో ఆ పార్టీకి కనువిప్పు కలుగుతుందన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయకపోతే సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటపై ఈ నెల 26న అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణానికి తాను సిద్ధమని, రేవంత్ కూడా అందుకు సిద్ధమా అని సవాల్ చేశారు. కాంగ్రెస్ పరిస్థితి పనికి ముందు ఓడ మల్లప్ప.. పని తర్వాత బోడ మల్లప్ప అన్నవిధంగా ఉందన్నారు. కాంగ్రెస్వి తుపాకీ రాముడి మాటలన్న సంగతిని ప్రజలు గ్రహించారని, గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని అన్నారు. నామా గెలుపును ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
ప్రతిఒకరూ క్షేత్రస్థాయిలో పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. తెలంగాణ వాణి పార్లమెంట్లో వినిపించే సత్తా ఒక బీఆర్ఎస్ ఎంపీలకే సాధ్యమన్నారు. తనను గెలిపించి, కేసీఆర్కు మద్దతుగా నిలవాలని అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్కు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు మన పార్టీకి ముఖ్యమైన ఎన్నికలని, నామాను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అని, కేసీఆర్ కారణంగానే రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లిందన్నారు.
తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంటులో బలంగా వినిపించిన బీఆర్ఎస్ పక్షనేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామా నాగేశ్వరరావు తిరిగి విజయం సాధించడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కుంగితే నీళ్లను సముద్రం పాల్జేసీ రేవంత్రెడ్డి కృత్రిమ కరువు తెచ్చారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నెత్తిమీద కుంపటి పెట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నారన్నారు.
నామా గెలుపు ద్వారా కార్యకర్తలు సత్తా చాటాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి నామాను గెలిపించాలని కోరారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, మదన్లాల్, ఖమ్మం మేయర్ నీరజ, బచ్చు విజయ్కుమార్, దుర్గ, బొమ్మెర రామ్మూర్తి, ఆర్జేసీ కృష్ణ, కర్నాటి కృష్ణ, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.