ఢిల్లీ : పార్లమెంట్ ( Parliament ) వర్షాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ ( BRS ) తరుఫున తెలంగాణ సమస్యలపై గళమెత్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవీంద్ర ( BRS MP Vaddiraju ) వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటులో ఉన్న 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యల పైన గొంతెత్త లేదని ఆరోపించారు.
తెలంగాణ రైతులు, ప్రజల సమస్యలపైన గొంతెత్తి, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలపైన బీఆర్ఎస్ తరఫున కొట్లాడామని అన్నారు. తెలంగాణ సాధించి, అద్భుతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని మళ్లీ గెలిపించడానికి తెలంగాణ సమాజం ఎదురుచూస్తోందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై అన్నివర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. మరోసారి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంఎంటీఎస్ రైలు రెండవ దశ పనులు , సహకార బిల్లుపై తమ వాదనలు వినిపించామని ఎంపీ వెల్లడించారు.