ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటారు. ఉత్తీర్ణత శాతం గతంతో పోలిస్తే ద్వితీయ సంవత్సరంలో అదే శాతాన్ని పదిలం చేసుకోగా.. ప్రథమ సంవత్సరంలో నాలుగు శాతం వెనుకబాటు కనిపించింది. అయినా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ఫలితాలనే సాధించింది. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నాల్గవ స్థానాన్ని దక్కించుకోగా.. ద్వితీయ సంవత్సరంలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. నాలుగైదేళ్ల నుంచి జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మార్కుల్లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంటుండగా.. ఈసారీ దానిని కొనసాగించారు.
ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే బాలికలే తమ హవా కొనసాగించారు. రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో సైతం బాలురతోపాటు బాలికలు మెరుగైన ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. ప్రథమ ఇంటర్లో జిల్లా ఉత్తీర్ణత శాతం 63 కాగా.. అందులో బాలికలు 71.93 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా, బాలురు 55.85 శాతంతో సరిపెట్టుకున్నారు. ద్వితీయ సంవత్సరంలో 74 శాతం సాధించగా.. వారిలో బాలికలు 80.44 శాతంతో రాణించగా.. బాలురు 67.77 శాతంతో సరిపెట్టుకున్నారు.
బుధవారం ఇంటర్ బోర్డు ప్రకటించిన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో 16,015 మంది విద్యార్థులకు.. 10,224 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 8,054 మందికి.. 4,498 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,961 మందికి.. 5,726 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా.. బాలురు 55 శాతం, బాలికలు 72 శాతంగా ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 2,466 మందికి.. 1,214 మంది ఉత్తీర్ణులై 49 శాతం ఫలితాలు సాధించారు.
ద్వితీయ సంవత్సర ఫలితాల్లో జనరల్ విభాగంలో 14,564 మంది విద్యార్థులకు.. 10,806 మంది ఉత్తీర్ణులై 74.20 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 7,176 మందికి.. 4,863 మంది పాస్ అయి.. 67.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభాగంలో 7,388 మందికి.. 5,943 మంది పాస్ అయి.. 80.44 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో ఐదో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఒకేషనల్ విభాగంలో 2,071 మంది.. 1,404 మంది ఉత్తీర్ణత సాధించి 67.79 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు.
ఎంపీసీ ద్వితీయంలో 993 మార్కులతో టాపర్గా శ్రీచైతన్య కళాశాలకు చెందిన బి.అంజలి నిలిచారు. ఎస్ఆర్ కళాశాలకు చెందిన శీలం నందిత ఎంపీసీలో 993 మార్కులతో, బైపీసీలో తేజస్విని 990 మార్కులతో టాపర్గా నిలిచారు.