Jitesh V Patil | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 19 : ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతరాయం లేకుండా విద్యుత్ నిరంతరంగా సరఫరా అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. ఇవాళ జిల్లాలోని విద్యుత్, త్రాగునీరు, సాగునీరు, రేషన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన, రైతు భరోసా దరఖాస్తుల నమోదు ప్రక్రియలపై సంబంధిత జిల్లా అధికారులు, తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఏఓలు, ఎంసీఎస్, డిఈలు, మిషన్ భగీరథ, విద్యుత్ శాఖ ఏఈలతో టెలికాన్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ప్రజల గృహ, వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆటో జనరేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా పార్షియల్ సబ్ డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చినందున తహసిల్దారులు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని వ్యవసాయానికి యోగ్యం కానీ భూముల మార్కింగ్ ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో యూరియా ఎంత అందుబాటులో ఉంది. ఎంత అవసరం పడుతుందో తగిన నివేదికలు సమర్పించాలని, రైతులకు తగినంత ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సాగు అవసరాలకు నీరు అందేలా ఇరిగేషన్, మండల వ్యవసాయ అధికారులు, తహసీల్దార్ల సమన్వయంతో పర్యవేక్షించి చివరి రైతులకు కూడా సాగునీరు అందేలా చూడాలి అన్నారు. జిల్లాలో రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు మండల, జిల్లాస్థాయిలో అందించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో త్రాగునీటి అవసరాలకు సరిపడా నీరు ఉందని కలెక్టర్ అన్నారు. త్రాగునీటి సరఫరా లో వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ సెక్రటరీలు ఏ వార్డులో ఏ పంచాయితీలో త్రాగునీటి సరఫరాకు సమస్యలు ఉన్నాయో గుర్తించి.. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి..
త్రాగునీటి ట్యాంకులను ప్రతినెల రెండు సార్లు శుభ్రం చేసి బ్లీచింగ్ చల్లాలని ఆదేశించారు. ఎంపీడీవోలు ఎంపీలు తమ పరిధిలోని పాత మోటర్లు బాగు చేసి వాటిని అదనంగా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి గ్రామంలో 10 శాతం మోటర్లు ఘనంగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చేతిపంపులు ఎక్కడైతే రిపేరు ఉన్నాయో గుర్తించి వాటిని రిపేర్లను వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున కొత్త రేషన్ కార్డ్ ల పంపిణీ ఎన్నికల అనంతరం చేపడతామని కలెక్టర్ అన్నారు. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిశీలన పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన కొరకు స్థల గుర్తింపును త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలను ఆదేశించారు.
సమీక్షలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Warangal | కేంద్రం బడ్జెట్ను వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా
Swami bodhamayananda | ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత : స్వామి బోధమయానంద
Robbery | బైనపల్లి ఆలయంలో చోరీ.. హుండీ ధ్వంసం చేసి నగదు, ఆభరణాలు అపహరణ