KTR | కరీంనగర్ జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఐదుగురు దుండగుల ముఠా దోపిడీకి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దుండగుల ముఠా దోపిడీ చేసే క్రమంలో ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులకు తెగబడి.. భారీ మొత్తంలో నగలను దోచుకెళ్లింది. ఈ ఘటనలో గాయపడ్డ వారు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగా పీఎంజే జ్యువెల్లరీలో దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాలు అడిగిన తెలుసుకున్న కేటీఆర్.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డితోపాటు పలువురు నేతలు హాజరయ్యారు.

