Pocso case | గాంధీ చౌక్ : మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పోక్సో కేసుతోపాటు, అదే బాలికను హత్య చేసిన కేసులో నిందితుడు బండపల్లి నవీన్ కుమార్ (27)కు పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్ బుధవారం సంచలన తీర్పు వెలువరించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో చందుర్తి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం 2020 డిసెంబర్ 4న నిందితుడు బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారం చేసిన అనంతరం జరిగిన విషయాన్ని బయటపెడుతుందనే భయంతో బాలికకు విషం తాగించి హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను నిందితుడు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది.
సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణ..
బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీసులు హత్య, అత్యాచారం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ రెండు కేసులు సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చాయి. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై నేరాలు రుజువైనట్లు నిర్ధారించింది. దీంతో పోక్సో కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.7,000 జరిమానా, హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ కేసుల్లో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు నిర్వహించిన అప్పటి డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ వెంకటేష్, కోర్టు కానిస్టేబుళ్లు మహేందర్, లతీఫ్, నవీన్, వెన్నెలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించారు.
Pawan Kalyan | అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానిని పరామర్శించిన పవన్ కల్యాణ్
KTR | పానీపూరి తిని అస్వస్థతకు గురైన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలి : కేటీఆర్