Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డీఎన్డీ అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ, ఎదుగుదల లేని స్థితిలో, మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను తీర్చారు. స్వయంగా అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. చికిత్స నిమిత్తం రూ.లక్ష ఆర్థిక భరోసాతో పాటు భగవంతుడి తీర్థప్రసాదాలను అందజేశారు.
హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ అనే 17 ఏళ్ల బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కల్యాణ్ను కలవాలని ఉందని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. బుధవారం ఉదయం నిరంజన్ ఇంటికి వెళ్లాడు. బాలుడి తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసకున్నారు. కుటుంబసభ్యులకు మనోధైర్యం చెప్పి.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.
ఇక లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారు. అతని మంచంపై కూర్చొని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదుటిపై ముద్దుపెట్టి ఆప్యాయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానమని నిరంజన్ చెప్పిన మాటలు విని కదలిపోయారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని కప్పి, కల్యాణం అక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలను అందించి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. రంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ విఖ్యాత భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని తెలిపారు. పూజ చేయించి వెండి ప్రతిమను అందజేస్తానని చెప్పారు.