Maganuru | మాగనూరు (కృష్ణ), ఆగస్టు 7: ఒకప్పుడు గ్రామానికి విద్యుత్ సరఫరాలో కీలకంగా ఉన్న కుసుమూర్తి విద్యుత్ సబ్స్టేషన్ ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వానంగా మారింది. సబ్స్టేషన్ ప్రాంగణమంతా ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయింది. ప్రధాన గేటు చుట్టూ పొదలు పెరిగిపోవడంతో లోపలికి వెళ్లే దారి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది.
మరోవైపు సబ్స్టేషన్ పరిసరాల్లోని పలు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగి ప్రమాదకరంగా మారాయి. కొన్ని స్తంభాలు కరెంట్ తీగల ఆధారంగా నిలిచి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గాలులు, వర్షాలు తీవ్రంగా కురిసే సమయంలో అవి ఎప్పుడు కూలిపోతాయోనని రైతులు, గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ మార్గంలో రైతులు, వ్యవసాయ కూలీలు, వాహనదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు కూలితే ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

Kusumurthy Substation2
సబ్స్టేషన్ ప్రాంగణాన్ని వెంటనే శుభ్రం చేయడంతోపాటు, ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులను అధికారులు వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. నిర్లక్ష్యం కొనసాగితే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.