తెలంగాణ ఆర్టీసీ సారథ్య బాధ్యతలను ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చేపట్టారు. సోమవారం హైదరాబాద్ బస్భవన్లో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.
డిచ్పల్లి, సెప్టెంబర్ 20 : రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్గా నియమితులైన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సోమవారం హైదరాబాద్ బస్భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ఉదయం 9.35 గంటలకు బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మొదట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, మహమూద్ అలీలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత, మంత్రులు.. బాజిరెడ్డి గోవర్ధన్ను సీటులో కూర్చోబెట్టి తొలి సంతకం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిగాల గణేశ్ గుప్తా, ఆశన్నగారి జీవన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్.సురేశ్ రెడ్డి, నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, టీయూ వీసీ రవీందర్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్ఎంబీ రాజేశ్వర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టీసీ ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదు..
ఆర్టీసీ బస్సులు, ఆస్తులు అమ్మే ప్రసక్తే లేదని, సంస్థకు పూర్వ వైభవం తీసుకువస్తానని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీయబోమని స్పష్టం చేశారు. కష్టపడేతత్వం ఉన్న ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ ఉన్నారని, సంస్థ ఆదాయాన్ని తిరిగి 13 నుంచి 14 కోట్లకు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆర్టీసీ సేవలను పునఃప్రారంభిస్తామన్నారు. తనపై ఎంతో నమ్మకంతో ఆర్టీసీ చైర్మన్గా నియమించిన సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.