గజ్వేల్ అర్బన్/వర్గల్/మర్కూక్, ఏప్రిల్7: ‘గలగలా గోదావరి పరుగులిడుతుంటే’.. అని అప్పుడెప్పుడో మనం పాడుకున్న పాట.. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో నిజమవుతున్నది. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం అవుసుల పల్లి వద్ద హల్దీవాగులోకి, పాములపర్తి వద్ద గజ్వేల్ కెనాల్లోకి సీఎం కేసీఆర్ విడుదల చేయడంతోనే గోదావరి జలాలు పరుగుపరుగున చెరువుల్లోకి పారుతున్నాయి. అవుసులపల్లి వద్ద సంగారెడ్డి కెనాల్ నుంచి ఆఫ్ టెక్ ద్వారా బంధంచెరువులోకి విడుదల చేసిన నీటితో 24గంటల్లో సరిగ్గా బుధవారం 11గంటలకు బంధంచెరువు పూర్తిగా నిండి, మత్తడి దూకింది. మత్తడి దూకిన గోదావరి జలాలు కాలువ ద్వారా పెద్దచెరువులోకి చేరుకుంటున్నాయి. బుధవారం రాత్రి వరకు వర్గల్ పెద్ద చెరువు కూ డా పూర్తి నిండి, శాకారం ధర్మాయ చెరువులోకి నీరు వెళ్లనున్నాయి. బంధం చెరువులో 14 మెట్రిక్క్యూబిక్ ఫీట్ల నీళ్లు నిల్వ సామర్థ్యం కాగా, చెరువు కింద 150ఎకరాల ఆయకట్టు ఉంది.
వర్గల్ పెద్ద చెరువులో 12మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల సామర్థ్యం కాగా, 140ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఈ రెండు చెరువులు నిండడంతో 290ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. అలాగే గజ్వేల్ కెనాల్ ద్వారా పాములపర్తి రెడ్డికుంట నిండి పెద్దచెరువులోకి నీరు పారుతున్నాయి. శుక్రవారం పెద్దచెరువు నిండి, పటేల్కుంటలోకి కుంటలోకి అలుగుపారే అవకాశముంది. కాగా, రెడ్డికుంటలో 2.17మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల నీటి నిల్వ సామర్థ్యముండగా, ఈ కుంట కింద 13ఎకరాల ఆయకట్టు ఉన్నది. పాముల పెద్దచెరువులో 29.34 మెట్రిక్ క్యూబిక్ ఫీట్ల సామర్థ్యం ఉండగా, 176.06 ఎకరాల ఆయకట్టు ఉన్నది. గజ్వేల్ కెనాల్లోని లోని గోదావరి జలాలు ప్రజ్ఞాపూర్, ముట్రాజ్పల్లి, సంగాపూర్ వరకు చేరుకున్నాయి. గజ్వేల్ కెనాల్ నుంచి ప్రజ్ఞాపూర్ ఊర చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్
‘గోదావరి జలాలతో చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు ఎన్ని నిండాయి? నీళ్లు ఎంతవరకు వెళ్లాయి?’.. అంటూ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు స్థానిక నాయకులతో వాకబు చేస్తున్నారు. మంగళవారం నీటి విడుదల తర్వాత, సాయంత్రం నుంచి ఎప్పటికప్పుడు చౌదరిపల్లి, పాములపర్తి గ్రామాల నాయకులకు ఫోన్లు చేసి, కాలువల్లో నీళ్లు ఎంతవరకు వచ్చాయి? ఎన్ని చెరువులు, కుంటలు పారాయి? అని అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు ములుగు పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి బంధంచెరువు నుంచి వర్గల్ పెద్దచెరువులోకి పారుతున్న నీటిని పరిశీలించారు.
ఇవీ కూడా చదవండీ…
కొనసాగుతున్న వ్యాక్సినేషన్, ర్యాపిడ్ టెస్టులు
మాస్కు ధరించకుంటే సరుకులు ఇవ్వొద్దు
కార్మికుల హక్కుల రక్షణకు చర్యలు చేపట్టాలి