Health Insurance | న్యూఢిల్లీ, మే 8: ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నవారికి షాకివ్వబోతున్నాయి బీమా రంగ సంస్థలు. గడిచిన ఏడాదిగా ప్రీమియం చార్జీలను 50 శాతం వరకు పెంచిన సంస్థలు..మరోదఫా పెంచడానికి సిద్ధమవుతున్నాయి. బీమా నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ నిర్ణయంతో ప్రీమియం చార్జీలు పెంచకతప్పడం లేదని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం 25 శాతం నుంచి 50 శాతం వరకు పెరగగా..వచ్చే కొన్ని నెలల్లో మరో 10 శాతం నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నాయని లోకల్సర్కిల్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
ఈ సర్వేలో 11 వేల మంది పాల్గొన్నారు. వీరిలో 21 శాతం మంది ప్రీమియం 50 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించగా..31 శాతం మంది 25-50 శాతం వరకు పెరిగాయని తెలిపారు. ప్రీమియం అధికమవడంతో సామాన్యులు ఆరోగ్య పాలసీ తీసుకోవడానికి జంకుతున్నారు. 2022లో 62 శాతంగా ఉన్న పాలసీదారులు ఆ తర్వాతి ఏడాదిలో 52 శాతానికి తగ్గారు. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య బీమా రంగం రికార్డు స్థాయిలో లక్ష కోట్ల రూపాయలను ఆర్జించింది. వార్షిక వృద్ధిరేటు 20 శాతంగా ఉన్నది. కరోనాతో ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, ప్రస్తుతం తగ్గుముఖం పట్టారు.