హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు. హైదరాబాద్ కూకట్పల్లిలో గురువారం జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ విషయంపై స్పందించారు. 22ఏ విషయంలో మీమీ సొంత భూములు కోల్పోకుండా చూసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు.
ఈ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ఎవరైనా కొనుగోలు చేసిన భూమి ఏదైనా కారణం చేత 22ఏలో పడితే ఆ భూమి ఎక్కడికీ పోదని తెలిపారు. అధికారులతో మాట్లాడి ఆ భూమి రిజిస్ట్రేషన్లు అయ్యేలా ఆదేశాలిస్తానని చెప్పారు. ఒక సర్వేనంబర్లో 500 ఎకరాలు ఉన్నవాటిలో రెండు, మూడు ఎకరాలపైనే కేసులుంటే కోర్టు ఆదేశాలతో 22 ఏలో పెడుతున్నారని వెల్లడించారు.
అలాంటి భూములకు బైనంబర్లు ఇచ్చి, ప్రభుత్వ భూమిని తీసేసి కొనుగోలు చేసుకొన్నవారి భూములు రిజిస్ట్రేషన్ అయ్యేలా చూసే బాధ్యత తనదని స్పష్టంచేశారు. కొనుక్కున్న భూమి, కట్టుకున్న ఇల్లు మళ్లీ రిజిస్ట్రేషన్ అయ్యేలా చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. కొంతమంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
ఇలా మొత్తానికి 22ఏ భూముల విషయంలో తప్పు జరిగినట్టు సీఎం రేవంత్రెడ్డి స్వయంగా అంగీకరించడం సంచలనంగా మారింది. అంటే ప్రభుత్వం కావాలనే భూములను నిషేధిత జాబితాలో చేర్చిందా? అనే చర్చ జరుగుతున్నది. ఇదే సభలో సీఎం మాట్లాడుతూ తాను గొప్ప తెలివైన వాడినేమీ కాదని, పెద్ద పెద్ద చదువులూ చదువుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే తనకు అదృష్టం కలిసి వస్తున్నదని, ఇబ్బందులు కలిగినప్పుడల్లా అదృష్టం తనవైపే ఉంటుందని చెప్పుకోవడం గమనార్హం.