హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కృష్ణా జలాల్లో 70 శాతం తమకే కేటాయించాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును (కేఆర్ఎంబీ) డిమాండ్ చేస్తున్నది. తెలంగాణకు కేవలం 30 శాతం చాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జలాల వినియోగానికి నీటి విడుదల ఉత్తర్వులివ్వాలని కోరుతూ కేఆర్ఎంబీ చైర్మన్కు ఏపీ ఈఎన్సీ నర్సింహమూర్తి తాజాగా లేఖ రాశారు.
శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్ల కింద నీటి అవసరాలకు సంబంధించిన ఇండెంట్ను సమర్పించారు. ఈ నెల 17న త్రిసభ్య కమిటీ సమావేశం కానున్నది. ఇందులో ఏపీ ఇండెంట్పై చర్చించనున్నారు. సూపర్ ఎల్ నినో ప్రభావంతో కృష్ణా బేసిన్లో సాధారణం కన్నా 49 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఏపీ తన లేఖలో తెలిపింది. సెప్టెంబర్, అక్టోబర్లో కూడా వర్షపాతం తక్కువగానే నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో రిజర్వాయర్ల నీటి వినియోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరమున్నదని సూచించింది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో 182.60 టీఎంసీలు ఉన్నాయని, ఇందులో ఎండీడీఎల్ (మినిమమ్ డ్రా డౌన్ లెవల్)పైన వినియోగానికి కేవలం 128.76 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. నాగార్జునసాగర్లో నీటినిల్వ మట్టం 149.45 టీఎంసీలు కాగా, వినియోగానికి అందుబాటులో ఉన్నవి 17.79 టీఎంసీలు మాత్రమేనని తెలిపింది. మొత్తంగా రెండు రిజర్వాయర్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 146.55 టీఎంసీలేనని వివరించింది. ఈ జలాల్లో 115.70 టీఎంసీలను అంటే 70 శాతం వాటాను ఏపీకే కేటాయించాలని, తెలంగాణకు 30.85టీఎంసీలు అంటే 30శాతం వాటా చాలని బోర్డుకు ప్రతిపాదనలు సమర్పించింది.
ఎల్ నినో నేపథ్యంలో రిజర్వాయర్లలోని జలాలను కేవలం తాగునీటికే వినియోగించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. తమకు అక్టోబర్ 31 వరకు తాగునీటికే 47టీఎంసీలను కేటాయించాలని డిమాండ్ చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ ద్వారా 22 టీఎంసీలు, హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా 11టీఎంసీలు, సాగర్ కుడికాలువ ద్వారా 7 టీఎంసీలు, ఎడమకాలువ కింద ఒక టీఎంసీ, కృష్ణా డెల్టాకు 5 టీఎంసీలు.. మొత్తంగా 47 టీఎంసీలు అవసరమని ప్రతిపాదించింది.
రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న జలాల్లో ఏపీకి దక్కే 115.70 టీఎంసీల్లో ఈ 47 టీఎంసీలను తాగునీటికి కేటాయించాలని, అత్యవసరంగా ఆ జలాల వినియోగానికి నీటి విడుదల ఉత్తర్వులను జారీ చేయాలని బోర్డును ఏపీ డిమాండ్ చేసింది. అయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోతిరెడ్డిపాడు ద్వారా 6.50టీఎంసీలు, సాగర్లో 7.15 టీఎంసీలను మళ్లించుకుపోయింది.
అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్నదని సాగునీటి రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆది నుంచీ కాంగ్రెస్ సర్కార్ చర్యలు ఏపీకి వంతపాడుతున్నట్టే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ, ఏపీ ఇండెంట్కు కేఆర్ఎంబీ ఆమోదం తెలిపినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.