హైదరాబాద్/సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 74,274 వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,914 మందికి పాజిటివ్గా తేలింది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఐదుగురు మృతిచెందగా, మొత్తం మరణాల సంఖ్య 1,734కు చేరుకున్నది. 11,617 మంది దవాఖానలు, హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నట్టు బుధవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 393, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 205 వెలుగుచూశాయి. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, 45 ఏండ్లు దాటినవారు వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ విజ్ఞప్తిచేసింది. ఇతర సమాచారం, టెలిమెడిసిన్, అనుమానాల నివృత్తికి 104కు ఫోన్చేయాలని, ప్రైవేట్ దవాఖానలు, ల్యాబ్ల విషయాలు, ఫిర్యాదుల కోసం 9154170960 నంబర్కు వాట్సాప్చేయాలని పేర్కొన్నది. ఏపీలోనూ వైరస్ విజృంభిస్తున్నది. మంగళవారం 31,812 నమూనాలను పరీక్షించగా, 2,331 మందికి నిర్ధారణ అయ్యింది. 11 మంది మృత్యువాతపడ్డారు.
57,803 మందికి తొలిడోస్
రెండో దఫా వ్యాక్సినేషన్లో మంగళవారం 57,803 మందికి తొలిడోస్, 4,782 మందికి రెండోడోస్ వేశారు. తొలిడోస్ తీసుకున్నోళ్లు 13,37,948కి చేరగా, రెండుడోసులు తీసుకున్నవారి సంఖ్య 2,70,822కు చేరింది.
మాస్క్ లేకుంటే ఆర్టీఏలో నో ఎంట్రీ
మాస్క్ ధరించకుంటే ఆర్టీఏ కార్యాలయాల్లోకి నో ఎంట్రీ ప్రకటించారు. మాస్క్ ధరించని వారిని కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు. ప్రతి రవాణా కార్యాలయంలో మాస్క్, భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే దరఖాస్తుదారుడిని మాత్రమే లోపలికి అనుమస్తున్నారు. కార్యాలయాలకు వచ్చే అధికారులు, సిబ్బంది కోసం శానిటైజర్లు ఏర్పాటు చేశారు.
ఆలయాల్లో అప్రమత్తం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆలయాల్లో నిత్యం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడుసార్లు శానిటైజ్ చేయడంతోపాటు దర్శనం కోసం వచ్చిన భక్తులు శానిటైజ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. మాస్క్ ధరించి వస్తేనే ఆలయంలోకి ప్రవేశం కల్పిస్తున్నారు. థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ జ్వర లక్షణాలు ఉన్నవారిని వెనక్కు పంపుతున్నారు. భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లుచేశారు.