NDSA | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల క మిటీ నివేదికపై రాష్ట్ర ఇంజినీర్లు తీవ్ర అసహనం వ్య క్తం చేస్తున్నారు. మరమ్మతులకు సంబంధించి తాము ఎప్పుడో సూచించిన అంశాలనే మార్గదర్శకాల పేరిట జారీ చేశారు తప్ప అందులో కొత్త విషయాలేమీ లేవని ఆక్షేపిస్తున్నారు. విలువైన సమయాన్ని వృథా చేశారని, వర్షకాలం సమీపిస్తున్న తరుణంలో నివేదిక విడుదల చేసి పనులను పూర్తిచేయాలని ఆదేశించడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఆనాడే చెప్పిన రాష్ట్ర అధికారులు
మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ గత అక్టోబర్లో కుంగుబాటుకు గురైన రెండు రోజుల్లోనే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ అధికారుల బృందం రాష్ర్టానికి విచ్చేసింది. అక్కడ ఎలాంటి పరీక్షలను నిర్వహించకుండానే బరాజ్ కుంగుబాటునకు అనేక ఊహాజనిత కారణాలను విశ్లేషిస్తూ వారం తిరక్కుండానే నివేదికను విడుదల చేసింది.
మళ్లీ ఈ ఏడాది మార్చి వరకు బరాజ్ ఊసెత్తలేదు. ఆ తర్వాత ఎట్టకేలకు బరాజ్ కుంగుబాటునకు కారణాలను అధ్యయనం చేసి, పునరుద్ధరణ చర్యలను సిఫారసు చేసేందుకు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ మార్చి నెలలో రెండు పర్యాయాలు క్షేత్రస్థాయిలో బరాజ్ను పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీల నుంచి వివరాలను సేకరించింది.
ఆ వెంటనే ఆ మధ్యంతర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు ఆ కమిటీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో బరాజ్ రక్షణకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మధ్యంతర నివేదిక ఇవ్వాలని విన్నవించారు. దీంతో అన్ని బరాజ్లలో రాఫ్ట్ కింద ఉన్న రంధ్రాలను గుర్తించి, వాటిని పూడ్చడంతోపాటు బ్లాకులవారీగా గేట్ల నిర్వహణకు ఆధునిక స్కాడా విధానాన్ని అమలు చేయాలని కమిటీ సూచించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల ఓఅండ్ఎం పనులను ఐఎస్ కోడ్ ప్రకారం చేపట్టేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించాలని, బరాజ్ల ఎగువన, దిగువన వాటర్ ఫ్రూప్ కోసం సిమెంట్ గ్రౌటింగ్ చేపట్టడంతోపాటు ప్రవాహాలకు ఆటంకంగా మారే రాళ్లను తొలగించాలని తెలిపింది.
వానాకాలంలో బరాజ్ల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, మేడిగడ్డ 7వ బ్లాక్లో జామ్ అయిన గేట్లను తొలగించాలని, స్టీల్ షీట్పైల్స్ను అదనంగా ఏర్పాటు చేయాలని, బరాజ్లపై వరద ఒత్తిడిని తగ్గించేందుకు ఎగువభాగంలో నదిపై రెగ్యులేటర్లు నిర్మించాలని, బరాజ్ల ఎగువ, దిగువన నదీ గర్భంలోని ఇసుక మేటలను ఇరిగేషన్శాఖ పర్యవేక్షణలో తొలగించాల్సి ఉంటుందని తెలిపింది. ఆయా పనులను చేపట్టేందుకు అనుమతులివ్వాలని కోరింది. నాడు రాష్ట్ర అధికారులు సూచించిన అంశాలనే యథాతథంగా నేడు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సూచించడం గమనార్హం.
విలువైన సమయం వృథా
ఎన్డీఎస్ఏ సూచనలను అమలు చేయడానికి మిగిలింది 5 వారాలేనని, ప్రభుత్వం జనవరిలోనే ఆ పనులకు అనుమతిచ్చి ఉంటే ఈ పాటికి 90 శాతం పనులు పూర్తయ్యేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ మీదున్న భరోసా తమపై లేకుండా పోయిందని రాష్ట్ర ఇంజినీర్లు వాపోతున్నారు. ఇక ప్రస్తుతం కమిటీ సూచించిన విధంగా షీట్పైల్స్ డ్రైవ్ చేయడం తదితర పనులను పూర్తి చేసేందుకు సమయం సరిపోదని స్పష్టం చేస్తున్నారు.
2 గేట్ల తొలగింపే ప్రధాన సవాల్
ప్రస్తుతం మేడిగడ్డ బరాజ్లోని 7వ బ్లాక్ గేట్లను ఎత్తడమే అతిపెద్ద సవాలని అధికారులు వివరిస్తున్నారు. బరాజ్లోని 7వ బ్లాక్ మినహా మిగిలిన అ న్ని బ్లాకుల్లోని గేట్లను ఇప్పటికే అధికారులు పైకి ఎత్తిపెట్టారు. 7వ బ్లాక్లోని గేట్లను మాత్రం యథావిధిగా ఉంచారు. అందులోనూ ప్రధానంగా రెండు గేట్లు మినహా మిగతా గేట్లను ఎత్తడంలో పెద్దగా ఇ బ్బందులు ఉండబోవని స్పష్టం చేస్తున్నారు.
కేవ లం కుంగుబాటుకు గురైన 20వ పిల్లర్, పగుళ్లు ఏ ర్పడిన 21వ పిల్లర్కు సంబంధించిన 2 గేట్లను తొ లగించడం ఎలా అన్నదానిపైనే తర్జనభర్జనలు పడుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. పిల్లర్ కుంగుబాటుతో గేట్ అమరిక సైతం చెదిరిపోయిందని, గేట్ల ను పైకి ఎత్తే రోప్లు వదులయ్యాయని, గ్రాంట్రీ క్రే న్ నడిచే ట్రాక్ సైతం వంగిపోయిందని అంటున్నా రు. దాదాపు 70 టన్నుల బరువుండే ఒక్కో గేట్ను ఎత్తాలంటే 100 టన్నులకుపైగా బరువుండే మెషినరీ కావాలని, అలాంటి మెషినరీని ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగించే అవకాశం లేదని చెప్తున్నారు.