మోర్తాడ్, ఆగస్టు 1: కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ నిరంతరం దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రాంపూర్ పంప్హౌస్ మోటర్లను ప్రారంభించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎత్తిపోతలతో కాంగ్రె స్ సర్కార్ చేస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేలిపోయిందని పేర్కొన్నారు. కూలి పోయిందని, ఉపయోగంలేదని, లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని కాళేశ్వరం ప్రాజెక్ట్పై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాంపూర్ పంప్హౌస్ మోటర్లను ప్రారంభించి గోదావరి జలాలను ఎస్సారెస్పీ వరద కాలువలోకి ఎత్తిపోస్తున్నారని, ఈ పంప్హౌస్ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తించాలని సూచించారు.
వరద కాలువపై ఉన్న రాజేశ్వర్రావుపేట్ పంప్హౌస్ను కూడా వెంటనే ప్రారంభించి ఎస్సారెస్పీ వరకు మొత్తం వరద కాలువను పూర్తినీటితో నింపాలని, వరద కాలువ ద్వారా చెరువులు కూడా నింపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఎస్సారెస్పీపై ఉన్న లక్ష్మి లిఫ్ట్, వేంపల్లి లిఫ్ట్, బోదెపల్లి లిఫ్ట్, చౌట్పల్లి హనుమంత్రెడ్డి, గుత్ప-అలీసాగర్ లిఫ్ట్లను వెంటనే ప్రారంభించి నిజామాబాద్ జిల్లాలోని చెరువులను నింపి రైతాంగానికి నిరంతరం సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.