Congress | న్యూఢిల్లీ, మే 8: దేశంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకొనే కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. గతంలో సొంతంగా అధికారం చేపట్టే స్థాయి నుంచి లోక్సభలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాకు అవసరమైన కనీసం 10% ఎంపీ స్థానాలను కూడా సాధించలేని దుస్థితికి హస్తం పార్టీ చేరింది. ఆ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న స్థానాల సంఖ్య తొలిసారి 400 కంటే తక్కువకు పడిపోయింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 328 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను నిలబెట్టింది. 2019 ఎన్నికల్లోనూ యూపీఏలో కూటమిగా ఉన్నప్పటికీ, ఆ పార్టీ సొంతంగా 421 స్థానాల్లో పోటీచేయడం గమనార్హం. తాజా పరిస్థితికి యూపీ, తమిళనాడు, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ర్టాల్లో ఆ పార్టీ బలంగా లేకపోవడం, ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం వంటి కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీచేసే స్థానాల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటం కారణంగా చెప్పవచ్చు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ర్టాల్లో కాంగ్రెస్ కంటే బలంగా ఉన్న ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలు సింహభాగం సీట్లను తీసుకొన్నాయి. అయితే కూటమిగా ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. 1989-1999 మధ్య కూటముల సమయంలోనూ ఆ పార్టీ 450కి పైగా స్థానాల్లో పోటీచేయడం గమనార్హం. అయితే ఈ సారి పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తున్నది.
యూపీలో 2019 ఎన్నికల్లో సొంతంగా 67 స్థానాల్లో పోటీచేసిన కాంగ్రెస్(కేవలం ఒక్క సీటు- రాయ్బరేలీ మాత్రమే గెలిచింది).. ఈసారి ఎన్నికల్లో కేవలం 17 స్థానాల్లోనే అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో బలంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ అధిక స్థానాల్లో పోటీచేస్తున్నది. బెంగాల్లో లెఫ్ట్ పార్టీలతో కూటమిలో భాగంగా కాంగ్రెస్ 42కిగానూ 14 లోక్సభ స్థానాల్లోనే బరిలో నిలిచింది. 2019 ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీచేసిన హస్తం పార్టీ.. కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. మహారాష్ట్రలో 48 సీట్లకుగానూ ఇండియా కూటమిలోని కాంగ్రెస్-17, శివసేన(యూబీటీ)-21, ఎన్సీపీ(ఎస్పీ)-10 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మహారాష్ట్రలో వరుసగా 25, 26 స్థానాల చొప్పున పోటీచేసింది.