హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : కోట్లాది రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసిందా? డిపోలవారీగా రిటైర్మెంట్కు దగ్గరున్నవారిని టార్గెట్ చేస్తూ అకారణంగా సస్పెండ్ చేస్తున్నదా? క్రమశిక్షణ, సమయపాలన, మద్యం పేరుచెప్పి ఉద్యోగంలోంచి పీకేస్తున్నదా? అంటే అవుననే అంటున్నారు కార్మికులు. ఆర్టీసీలో రిటైర్డ్ కార్మికులు, ఉద్యోగులు కలిపి సుమారు 17 వేల మందికి దాదాపు రూ.2 వేల కోట్ల రూపాయలు యాజమాన్యం బకాయి పడింది. అవి చెల్లించేందుకు మనసురాని యాజమాన్యం.. అత్యంత నిర్దాక్షిణ్యంగా రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న బడుగు, బలహీనవర్గాల వారిని లక్ష్యంగా చేసుకున్నదని కార్మికులు వాపోతున్నారు. ఎలాంటి మద్యం అలవాటు లేనివారిని సైతం ‘తాగుబోతు’లని ముద్రవేసి అకారణంగా సస్పెండ్ చేస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మద్యం తాగారని బ్రీత్ అనలైజర్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తూ.. వారి వాదన వినకుండా, ఎలాంటి మెడికల్ పరీక్షలు, రక్త, మూత్ర నమూనాలు సేకరించకుండానే అకారణంగా విధుల నుంచి తొలగిస్తున్నారు. ఇలా తొలగించినవారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఎక్కువగా ఉన్నారని కార్మికులు చెప్తున్నారు.
ఒక వ్యక్తి మద్యం తాగాడని నిరూపించాలంటే కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ, ముంబై హైకోర్టులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. మోటర్ వాహనాల చట్టంలోని సెక్షన్ 204, 185 సెక్షన్లలో స్పష్టంగా మద్యం అలవాటు లేనివారికి రక్షణ కల్పించాయి. సెక్షన్ 204 ప్రకారం ప్రాథమిక బ్రీతింగ్ అనలైజర్ రీడింగ్పై అనుమానం ఉన్నవారు, సదరు డిపార్ట్మెంట్ ప్రతినిధి ద్వారా వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకునే హక్కును ఈ సెక్షన్ కల్పిస్తుంది. అలాగే సెక్షన్ 185 ప్రకారం రక్తంలో ఆల్కహాల్ పరిమాణం 100 ఎంఎల్ రక్తానికి 30 ఎంజీ కంటే ఎక్కువ ఉండాలి. కేవలం బ్రీత్ అనలైజర్ ఆధారంగా, ఎలాంటి విచారణ లేకుండా శిక్ష విధించలేరు, విధుల నుంచి తప్పించలేరు. అయితే, ఇందుకు విరుద్ధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు అమాయకులను, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని సస్పెండ్ చేస్తున్నట్టు కార్మికులు చెప్తున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్లోని పలు డిపోల పరిధిలో సుమారు 15 మందిని సస్పెండ్ చేశారని అంటున్నారు.
కొందరు కిందిస్థాయి అధికారుల తప్పిదాలతో ఉన్నతాధికారులు తలదించుకోవాల్సి వస్తున్నదని కార్మికులు అంటున్నారు. మద్యం అలవాటు లేనివారిని, రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకోవడం ఆపాలని డ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. మంచిర్యాల డిపో నుంచి ఉత్తమ డ్రైవర్గా గతంలో అవార్డు అందుకున్న ఓ డ్రైవర్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అతనికి మద్యం అలవాటు లేకపోయినా.. బ్రీతింగ్ అనలైజర్ టెస్టులో మద్యం తాగినట్టు రావడంతో అతనిపై వేటు వేసేందుకు సిద్ధపడ్డారు. అతనికి అండగా తోటికార్మికులు, కండక్టర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ‘28 ఏండ్లుగా నేను ఎలాంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తించాను. ఉత్తమ డ్రైవర్ అవార్డు కూడా అందుకున్నాను. రిటైర్మెంట్కు దగ్గరిగా ఉన్న నన్ను నిందవేసి తొలగిస్తారా?’ అంటూ మీడియా ముందు ఆ డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యారు. గతవారం నగరంలోని ఓ డిపోలో రిటైర్మెంట్కు దగ్గరిగా ఉన్న ఓ డ్రైవర్కు బ్రీతింగ్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. తనకు మద్యం అలవాటు లేదని, ఉదయాన్నే పెరుగుతిని డ్యూటీకి వచ్చినట్టు చెప్తున్నా అధికారులు వినిపించుకోకుండా వేటు వేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. డివైజ్ ఫాల్ట్ వల్ల కూడా రీడింగ్స్లో భారీ వ్యత్యాసాలు వస్తున్నాయని, బెనిఫిట్స్ లాక్కునేందుకు తాగుబోతులనే నింద వేసి విధుల నుంచి తొలగిస్తే ఎలాంటూ ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బీసీ బిడ్డ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
డ్రైవర్లు మద్యం మత్తులో డ్యూటీ చేస్తే జరిగే అనర్థాలను నివారించేందుకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాడు బీఆర్ఎస్ హయాంలో సదుద్దేశంతో తెచ్చిన ఈ విధానం నేడు దుర్వినియోగం అవుతున్నదని కార్మికులు అంటున్నారు. ఎవరైనా డ్రైవర్ డ్యూటీకి వచ్చేముందు పెరుగన్నం తిన్నా, పులిసిన మజ్జిగ తాగినా, ఆయుర్వేద మందులు వేసుకున్నా, పుల్లతేన్పులు వచ్చినా బ్రీతింగ్ అనలైజర్లో ఆల్కహాల్ తీసుకున్నట్టు వచ్చే అవకాశం ఉన్నదని వైద్యులు చెప్తున్నారు. అలాంటప్పుడు ఓ వ్యక్తి మద్యం తాగాడని కచ్చితంగా నిరూపించాలంటే అతనికి తప్పనిసరిగా 6 నుంచి 12 గంటల్లోపు రక్త, మూత్ర పరీక్షలు (ఈటీజీ) 3 రోజుల్లోపు, శ్వాస పరీక్షలు 12 నుంచి 24 గంటల్లోపు, లాలాజల పరీక్ష 24 గంటల్లోపు, జుట్టు పరీక్ష 90 రోజుల్లోపు (ఇది దీర్ఘకాలిక అలవాటును నిర్ధారించడానికి) చేయించాలని పేర్కొంటున్నారు. ఇలాంటివి ఏమీ చేయకుండా, అసలు వైద్య పరీక్షలే నిర్వహించకుండా మద్యం అలవాటు లేనివారిని కూడా నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేస్తున్నారు.