తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రాంతం కామారెడ్డి అని, ఎంతో చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ కితాబునిచ్చారు. పోరాటాల గడ్డ కామారెడ్డి అంటూ చెప్పారు. పోలీస్ కిష్టయ్య తుపాకీతో ప్రాణాలు తీసుకుని తెలంగాణ కోసం అమరుడు అయ్యారని గుర్తు చేశారు. అడ్డగోలు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కామారెడ్డిలో పంటలు పెద్ద ఎత్తున ఎండిపోయాయన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ రెప్పపాటు కూడా పోలేదని, ఇప్పుడు ఏం మాయ రోగం వచ్చిందన్నారు. కేంద్రంలో ముమ్మాటికీ సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందన్నారు.
గోదావరి నదిని నరేంద్రమోదీ మళ్లీ ఎత్తుకొని పోయి అన్యాయం చేస్తా అంటున్నాడని, మరి గోదావరిని ఎత్తుకొని పోతా అంటే ఊకుందమా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రి కుయ్ లేదు కుక్కు లేదని, ఏం మాట్లాడడం లేదని మండిపడ్డారు. పార్లమెంట్లో ఈ రోజు బీఆర్ఎస్ ఎంపీలు ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా.. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా.. నదుల నీళ్లలో మన హక్కులు కాపాడాలన్నా. ఢిల్లీ నుంచి నిధులు తేవాలన్నా… మనం బతకాలన్నా… తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు.