నిజామాబాద్, మే 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఉండాల్నా… పోవాల్నా అంటూ కేసీఆర్ ప్రజలను అడిగారు. కొత్త జిల్లాలను రేవంత్ రెడ్డి తీసేస్తా అంటున్నాడని కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బస్సు యాత్రలో వివరించారు. జిల్లాను కాపాడుకుంటారా… పోగొట్టుకుంటారా మీ ఇష్టం అని కేసీఆర్ చెప్పారు. కామారెడ్డి జిల్లా ఉండాలంటే కచ్చితంగా జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ గెలవాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీలైతేనే కొట్లాడుతారని, మన భవిష్యత్తు కోసం పోరాడుతారని వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్షోకు అద్భుత స్పందన వచ్చింది. భారీ జన సందోహం మధ్య నిజాంసాగర్ చౌరస్తా నుంచి జేపీఎన్ రోడ్డు వరకు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగింది. జేపీఎన్ రోడ్డులో ప్రజలనుద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. నరేంద్రమోదీ ఈ దేశ ప్రధానిగా పదేండ్లుగా 150 హామీలిస్తే ఒక్క హామీ అమలు కాలేదన్నారు. సబ్కా సాత్ సబ్ కా వికాస్ అంటూ సత్యనాశ్ చేశారన్నారు.
ఐదు నెలలకు ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లా ఉండే… ఈ ఐదు నెలల్లోనే ఇంత ఆగం ఎందుకయ్యిందో ఒక్కసారి ఆలోచన చేయాలని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రెప్పపాటుకూడా పోకుండా వచ్చిన కరెంట్… ఇవాళ ఎందుకు పోతున్నదని, ఇవే కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులనూ కాంగ్రెసోళ్లు నిలిపివేస్తున్నారని వివరించారు. మంచినీళ్లు రాక… సాగునీళ్లు రాక… కష్టపడి పండించిన పంటను కొనేటోళ్లు లేక రైతులు గోసపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మీ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేను గెలిపించినందుకు ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతాలో రూ.30లక్షలు వేసిండంటా నిజమేనా అంటూ చమత్కరించారు. దీనికి రాలేదంటూ జనాలు చెప్పారు. ఏ వచ్చిందంట కదా…? అంటూ మళ్లీ ప్రశ్నించారు. రూ.30లక్షలు కాదు కదా రూపాయి కూడా రాలేదని చెప్పడంతో ఇదీ బీజేపీ పరిస్థితి అంటూ వాస్తవ పరిస్థితిని కేసీఆర్ ఎత్తి చూపారు.
మోదీ పాలనలో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ట మంటగలిసిందన్నారు. తెలంగాణకు ఏనాడూ ప్రధానిగా మోదీ మంచి పని చేయలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అని దిక్కుమాలిన మాటలతో విషం చిమ్మారన్నారు. ఎంతసేపూ మత విద్వేషం పెట్టుడు… గందరగోళమే మినహా మంచి పనులే చేయలేదన్నారు. బీజేపీ పనికి రాదని, ఓటు వేసినా వేస్ట్ అన్నారు. జహీరాబాద్ లోక్సభలో బీజేపీకి మూడో స్థానమే దిక్కు అన్నారు. ఉద్యమకారుడు, వినయ, విధేయత కలిగిన గాలి అనిల్కుమార్కు ఓటేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, దఫేదార్ రాజు పాల్గొన్నారు.