Tejashwi Yadav | హైదరాబాద్, మే 8 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): బీహార్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది. గత లోక్సభ ఎన్నికల్లో 40 సీట్లకు గానూ ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకొన్న ఎన్డీయే కూటమి.. ఈసారి కూడా ఇదే స్థాయిలో స్థానాలను గెలవాలని భావిస్తున్నది. అయితే, అది అయ్యే పనిలా కనిపించడం లేదు. మూడు దశల్లో జరిగిన పోలింగ్లో ఓటింగ్ శాతం తగ్గడమే దీనికి నిదర్శనం.
గత ఎన్నికలకు, బీహార్లో ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలకు చాలా తేడా ఉన్నది. బీజేపీ, జేడీయూ, ఎల్జేపీతో కూడిన ఎన్డీఏ కూటమి 2019 ఎన్నికల్లో కలిసి బరిలోకి దిగి ఎక్కువ సీట్లు గెలుచుకొన్నది. అయితే, గత ఎన్నికల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి పార్టీ(ఎల్జేపీ) ఇప్పుడు రెండుగా చీలింది. రామ్విలాస్ పాశ్వాన్ సోదరుడు పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలో ఏర్పడిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ(ఆర్ఎల్జేపీ) ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఎన్డీయేకు మైనస్గా మారింది. ఇక, బీహార్కు తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ ప్రభావం కూడా క్రమంగా తగ్గుతున్నది.
తరచూ కూటములు మార్చడం, మొన్నటి వరకు ఇండియా కూటమిలో ఉండి బీజేపీని విమర్శించి ఇప్పుడు అదే పార్టీతో జట్టు కట్టడం వంటి అంశాల వల్ల బీహార్ ప్రజల్లో నితీశ్ విశ్వసనీయత తగ్గుతున్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు గత ఎన్నికల్లోలా ఈసారి బీహార్లో క్లీన్స్వీప్ చేసే పరిస్థితులు ఎన్డీఏకు లేవని ఆ కూటమి నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు. గత ఎన్నికల ఫలితాలను ఎన్డీఏ పునరావృతం చేయడం కష్టమేనని జేడీయూ నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం ఎన్డీఏపై చూపించే అవకాశాలు ఉన్నాయని, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాల్లో కేంద్రంపై ప్రజలు గుర్రుగా ఉండటంతో ఈసారి బీహార్లో బీజేపీ గెలుపు కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
లాలూ వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన కుమారుడు తేజస్వీ ఇప్పుడు బీహార్లో ప్రధాన నాయకుడిగా అవతరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీహార్లో ఆర్జేడీని అతిపెద్ద పార్టీగా నిలిపిన ఘనత తేజస్వీదే. ఇప్పుడు ఇండియా కూటమిలోనూ ఆర్జేడీనే 25 స్థానాలకు పోటీ చేస్తుండటం ద్వారా ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీగా నిలిచింది. తేజస్వీ.. బీహార్ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో పట్టు సంపాదించుకున్నారు. దీనికి తగ్గట్టే ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు. సామాజిక సమీకరణాలను చూస్తే.. ఆర్జేడీ మొదటి నుంచి ముస్లిం – యాదవ ఓట్లను ఓటుబ్యాంకుగా మలుచుకున్నది. దీంతో తేజస్వీ అండ్ కో ఈసారి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.