భూపాలపల్లి: దేశ సమైఖ్యత పట్ల ఎంతో దూర దృష్టి కలిగిన మహనీయుడు సర్ధార్ వల్లభ్భాయి పటేల్ అని భూపాలపల్లి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు కొనియాడారు. గురువారం రాష్ట్రీయ ఏక్ తా దివస్( సర్ధార్ వల్లభ్భాయి పటేల్ జయంతి)ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు, సింగరేణి ఉద్యోగులు నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ ర్యాలీని జీఎం జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభ్భాయి పటేల్ స్వాతంత్య్రం నాటికి విడివిడిగా ఉన్న భారత సంస్థానాలను ఇండియన్ యూనియన్లోకి తీసుకరావడానికి ఎంతో కృషి చేశారన్నారు. స్వతంత్ర భారతావనికి ప్రథమ ఉప ప్రధానిగా, హోం మంత్రిగా విశేష సేవలు అందించారని ఆయన కొనియాడారు. భారత రాజ్యంగ రచనలో ప్రాథమిక హక్కుల గురించి ప్రస్తావించిన మేధావి సర్ధార్ వల్లభ్భాయి పటేల్ అని జీఎం శ్రీనివాసరావు అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, ఎజీఎం(ఐఈడీ) జోతి, ఏఎస్వో రవీందర్, అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం, ఎస్ఈ(పర్చెస్) శ్రీనివాసకుమార్, పీఎం శివకేశవరావు, ఐటీ మేనేజర్ రజనీ కుమారి, సీనియర్ పీవో పి. రాజేశం ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు సింగరేణి ఉద్యోగులు పాల్గొన్నారు.