సిటీబ్యూరో: ఎర్లీబర్డ్ పథకంపై పార్లమెంట్ ఎన్నికల ప్రభావం పడుతోంది. ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు వినియోగదారులు నామమాత్రంగానే స్పందించారు. ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ‘ఎర్లీబర్డ్’ స్కీంను ప్రవేశపెట్టింది. 30 సర్కిళ్ల పరిధిలో రూ. 800 కోట్ల మేర వసూళ్లను రాబట్టాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. అయితే గడిచిన 26 రోజుల వ్యవధిలో కేవలం రూ. 550 కోట్ల మేర మాత్రమే ఆదాయం వచ్చింది. 5.50 లక్షల మంది వినియోగదారులు ఈ ఎర్లీబర్డ్ స్కీంను సద్వినియోగం చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో 5 రోజుల్లో లక్ష్యాన్ని చేరడం కష్టసాధ్యంగానే మారింది.
ఇందుకు కారణాలు కమిషనర్ మొదలు ఉన్నతాధికారుల వరకు పార్లమెంట్ ఎన్నికల విధుల్లో ఉండటం.. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులపై పర్యవేక్షణ లేకపోవడం..ఎర్లీబర్డ్ స్కీంపై ప్రజలకు అవగాహన కల్పించకపోవమే అని అంటున్నారు. ముఖ్యంగా రూ. కోట్లలో ఆస్తిపన్ను బకాయి ఉన్న వారికి తరచూ ఎర్లీబర్డ్ స్కీం సద్వినియోగంపై ఎస్ఎంఎస్లు చేర్చేవారు. కానీ ఈ సారి అవగాహన కల్పనలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని జోన్ల కంటే ఖైరతాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల నుంచి ఎర్లీబర్డ్కు ఆశించిన స్పందన రాలేదని సమాచారం. కాగా, ఎర్లీబర్డ్ పథకానికి మిగిలింది ఐదు రోజులేనని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.