రాయపర్తి, జూలై 17: మండలకేంద్రంలో పది ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోయే బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని వరంగల్ ఆర్డీవో సీహెచ్ మహేందర్జీ సూచించారు. శనివారం తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, సర్పంచ్ గారె నర్సయ్యతో కలిసి ఆయన గ్రామ శివారులోని ప్రభుత్వ సీలింగ్ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి మెగా పార్కును అద్భుతంగా తయారు చేయాలని కోరారు. అనంతరం రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, కార్యదర్శి గుగులోత్ అశోక్నాయక్కు ఆర్డీవో శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనాన్ని సీఎంవో కార్యాలయం గుర్తించిందని, రాయపర్తి విలేజ్ పార్కు ఫొటోలు, వివరాలను పంపించాలని జిల్లా ఉన్నతాధికారులకు సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఆయన వివరించారు. సమష్టి కృషి, పట్టుదలతో పని చేస్తే ప్రభుత్వాలు గుర్తిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్గౌడ్, గిర్దావర్ మల్లయ్య, ఈజీఎస్ ఈజీ సాంబశివరావు, టీఏ యాకూబ్, వీఆర్ఏ కుమారస్వామి పాల్గొన్నారు.