నల్లగొండ, మే 7 : ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం హనుమకొండ నుంచి కాన్వాయ్ తో భారీ ర్యాలీగా బయల్దేరి వెళ్లి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి నల్లగొండలో నామినేషన్ వేశారు. అలాగే జిల్లాకేంద్రంలో హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీ గార్డెన్స్లో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు. అనంతరం మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి రాకేశ్రెడ్డి ఏఆర్వో, ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే మండలిలో నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వృథా అవుతుందని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో మాయమాటలు, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మరోసారి నమ్మి ఆ పార్టీకి ఓట్లు వేయవద్దు. గ్రాడ్యుయేట్లు ఆలోచించి బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేస్తే సమస్యలు పరిష్కరించడానికి రాకేశ్రెడ్డి పోరాటం చేస్తారు. కాంగ్రెస్ మోసాలు బయట పెట్టాలంటే ఎంపీలు, ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మన అభ్యర్థులు గెలిస్తేనే ఈ ప్రభుత్వాన్ని నిలదీయవచ్చు.
కేసీఆర్ బయటకు రాగానే కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కాంగ్రెస్కు వణుకు మొదలై ప్రజల్లో కొత్త ఉత్సా హం వచ్చింది. గ్రాడ్యుయేట్లు రెండు సార్లు నన్ను ఎమ్మెల్సీగా గెలిపించారు. ఈసారి రాకేశ్రెడ్డిని గెలిపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిల్ తత్వం గ్రాడ్యుయేట్లకు తె లుసు. ఎక్కడా గెలువలేక కాంగ్రెస్ కండువా కప్పుకొని వచ్చే తీన్మార్ మల్లన్నను చిత్తుచిత్తుగా ఓడించాలి. కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చామనడం సిగ్గుచేటు. బీఆర్ఎస్ ఉద్యోగులకు మంచి పీఆర్సీ ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు.
నన్ను ఎమ్మెల్సీగా గెలిపిస్తే మండలిలో ప్రశ్నించే గొంతుక అయి నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. ఈ నియోజకవర్గం నుంచి అన్ని సార్లు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈ సారి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మండలిలో పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నిస్తా. బీఆర్ఎస్లో ఉన్న స్వేచ్ఛ బీజేపీలో ఉం డదు. ఆ పార్టీలో నాకు కనీస గౌరవం ఇవ్వలేదు. ఇక్కడ కేసీఆర్ ఎంతో గౌరవంతో టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తున్నారు. మార్పు పేరుతో ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ర్టాన్ని ఆగమాగం చేసింది.